కోల్డ్వార్: కిరణ్ పేరుకు గవర్నర్ నో, అట్టిపెట్టుకున్న సిఎం
హైదరాబాద్: గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిల మధ్య మరోసారి విభేదాలు పొడసూపాయి. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కమిషనర్ల విషయం దాదాపు రెండేళ్ల క్రితం వారి మధ్య విభేదాలు కనిపించాయి. ఇప్పుడు శాసన మండలి సభ్యుల అంశంపై వారి మధ్య విభేదాలు కనిపించాయి.
ఇటీవల కాంగ్రెసు పార్టీ సీనియర్ నేతలు కంతేటి సత్యనారాయణ, రత్నాబాయి, నంది ఎల్లయ్యలను గవర్నర్ కోటాలో మండలికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఆ ముగ్గురితో పాటు రఘురామి రెడ్డి పేరును ముఖ్యమంత్రి గవర్నర్ కోటాకు సిఫార్సు చేశారు.

మొత్తం నాలుగు ఖాళీలు ఉండగా ముగ్గురి పేర్లను అధిష్టానం సూచించింది. అందులో నంది ఎల్లయ్య, రత్నాబాయి, కంతేటిలు ఉన్నారు. మరో ఖాళీ ఉండటంతో రఘురామి రెడ్డి పేరును గవర్నర్కు కిరణ్ పంపించారు.
అయితే, గవర్నర్ పై ముగ్గురి పేర్లకు మాత్రమే ఆమోదం తెలిపి, రఘురామి రెడ్డి పేరును తిరస్కరించారు. దీంతో తన వద్దకు వచ్చిన ఫైలును కిరణ్ తన వద్దనే అట్టి పెట్టుకున్నారు. రఘురామి రెడ్డి పేరును తిరస్కరించడంతో కిరణ్ ఆ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు.
విభజన విషయంలో కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానంతో తీవ్రంగా విభేదిస్తున్న విషయం తెలిసిందే. అధిష్టానంతో గవర్నర్కు మంచి సంబంధాలు ఉన్నట్లుగా ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో కిరణ్ సూచించిన పేరును గవర్నర్ తిరస్కరించడం, కిరణ్ ఆ ఫైలును తన వద్దే పెట్టుకోవడం గమనార్హం. ఫైలుపై కిరణ్ సంతకం చేయక పోవడాన్ని పిసిసి అధ్యక్షులు బొత్స సత్యనారాయణ కూడా లేఖ రూపంలో ప్రశ్నించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications