సరిహద్దు దాటి పరుగులు తీసిన మన రైలు.. ఇక నేరుగా విదేశానికి
భారత రైల్వే శాఖ సరిహద్దు వ్యాపార రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించింది. పొరుగు దేశమైన నేపాల్తో సరుకుల రవాణాను మరింత సులభతరం చేస్తూ తొలిసారిగా ఒక ప్రత్యక్ష వాణిజ్య కంటైనర్ గూడ్స్ రైలును విజయవంతంగా నడిపింది. కోల్కతా పోర్టు నుంచి ప్రారంభమైన ఈ ప్రత్యేక సరుకుల రైలు నేరుగా నేపాల్లోని విరాట్నగర్ కస్టమ్స్ యార్డ్కు చేరుకుంది. ఇరు దేశాల మధ్య సరుకు రవాణా రంగంలో వేగాన్ని, నమ్మకాన్ని పెంచే దిశగా ఈ ఘట్టం ఒక మైలురాయిగా నిలిచిపోనుంది.
గతంలో భారత్ నుంచి నేపాల్కు సరుకులు పంపించాలంటే సరిహద్దు వద్ద కంటైనర్లను దించి, మళ్లీ ఇతర వాహనాల్లోకి ఎక్కించాల్సి వచ్చేది. కానీ ఈ కొత్త విధానంతో ఎక్కడా సరుకులను మార్చే పని లేకుండా నేరుగా గమ్యస్థానానికి చేరవేసే వెసులుబాటు లభించింది. దీనివల్ల రవాణాకు పట్టే సమయం భారీగా తగ్గడమే కాకుండా, వ్యాపారులకు అయ్యే ఖర్చులు కూడా బాగా కలిసి రానున్నాయి. రాబోయే రోజుల్లో ఇరు దేశాల మధ్య వాణిజ్య కార్యకలాపాలు మరింత పుంజుకుంటాయని భావిస్తున్నారు.

2023లో వేసిన పునాది.. నేటికి సాకారం!
ఈ చారిత్రాత్మక రవాణా వెనుక పెద్ద ప్రణాళికే ఉంది. 2023 జూన్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ, నేపాల్ ప్రధాని కలిసి జోగ్బని - విరాట్నగర్ మధ్య బ్రాడ్గేజ్ రైల్వే లైన్ను ప్రారంభించారు. ఆ తర్వాత కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందాల ఆధారంగా ఇప్పుడు పూర్తిస్థాయి వాణిజ్య కంటైనర్ రైలును పట్టాలెక్కించారు. కెనోలా ఆయిల్ నింపిన 40 వ్యాగన్లతో బయలుదేరిన ఈ రైలు నేపాల్ చేరుకోవడంతో రెండు దేశాల వాణిజ్య సంబంధాల్లో సరికొత్త శకం మొదలైంది.
పర్యావరణానికి మేలు.. వ్యాపారులకు ఊరట
రహదారి మార్గం కంటే రైలు మార్గం ద్వారా సరుకులు పంపడం వల్ల ఇంధన ఆదాతో పాటు పర్యావరణ కాలుష్యం కూడా గణనీయంగా తగ్గుతుంది. దిగుమతి, ఎగుమతి వ్యాపారులకు సురక్షితమైన, వేగవంతమైన రవాణా సదుపాయం లభించడం వల్ల రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలకు ఇది ఎంతో ఊతాన్నిస్తుంది. సరిహద్దు దేశాలతో రవాణా అనుసంధానాన్ని పెంచుతూ, అంతర్జాతీయంగా భారత రైల్వే వ్యవస్థ విస్తరిస్తున్న తీరుకు ఈ విజయం స్పష్టమైన నిదర్శనంగా నిలిచింది.












Click it and Unblock the Notifications