జగన్, బాబు లేఖలు విడుదల: సీమాంధ్రులకు డిగ్గీ హామీ
న్యూఢిల్లీ: తెలంగాణకు అనుకూలంగా ఉన్నామని తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు గతంలో కేంద్రానికి ఇచ్చిన లేఖలను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ మంగళవారం మీడియాకు విడుదల చేశారు. సీమాంధ్రలో ఉధృతం ఉద్యమంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇరు ప్రాంతాలకు సమన్యాయమని, సమైక్యాంధ్ర అని టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిలు దీక్ష చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో డిగ్గీ గతంలో వారు రాసిన లేఖలను విడుదల చేశారు. అదే సమయంలో సీమాంధ్ర ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నామంటూ ఓ లేఖ మీడియాకు విడుదల చేశారు. తెలంగాణలోని సీమాంధ్రుల హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని, తెలంగాణలోని, హైదరాబాదులోని సీమాంధ్రుల భయాందోళనలను తాము తొలగిస్తామని చెప్పారు.
సీమాంధ్రుల సమస్యలకు పరిష్కారం చూపిస్తామన్నారు. హైదరాబాదులో విద్య, ఉపాధి అవకాశాలతో పాటు జలవనరులు, విద్యుత్ పంపిణీలో సీమాంధ్రుల హక్కులను పరిరక్షిస్తామని తెలిపారు. సీమాంధ్ర ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఇప్పటికైనా ఉద్యోగులు సమ్మెను విరమించాలని కోరారు.
ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నందున సమ్మె ఆపాలన్నారు. కేంద్రమంత్రుల బృందం అన్ని సమస్యలపై సంబంధింత వ్యక్తులతో చర్చలు జరుపుతుందన్నారు. చర్చలకు ప్రశాంత వాతావరణం కల్పించాలని కోరారు. సీమాంధ్ర ఉద్యమం పట్ల తాము ఆందోళన చెందుతున్నామని తెలిపారు. తెలంగాణకు అనుకూలంగా ఉన్నామని గతంలో టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు లేఖ ఇచ్చాయని తెలిపారు.
కట్టుబడి ఉన్నాం: రాజ్ నాథ్
తెలంగాణకు తమ పార్టీ కట్టుబడి ఉందని, కాంగ్రెసు ఇవ్వకుంటే తమ పార్టీ మూడు నెలల్లో రాష్ట్రాన్ని ఇస్తుందని బిజెపి జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ వేరుగా అన్నారు. సీమాంధ్రలో ఆందోళనకు కాంగ్రెసు పార్టీయే కారణమన్నారు. ఎలాంటి సమస్య లేకుండా మూడు నెలల్లో తాము మూడు రాష్ట్రాలు ఇచ్చామన్నారు. సీమాంధ్రుల భయాందోళనలు పరిగణలోకి తీసుకోవాలన్నారు.