సమాధానమివ్వు:పురంధేశ్వరికి డిగ్గీ సూటిప్రశ్న, పొత్తుపై
హైదరాబాద్: మాజీ కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ శనివారం సూటి ప్రశ్న సంధించారు. తెలంగాణను ఇవ్వడమే తప్పైతే, బిల్లుకు మద్దతిచ్చిన భారతీయ జనతా పార్టీలో ఆమె ఎలా చేరుతారని డిగ్గీ ప్రశ్నించారు. దీనికి ఆమె వివరణ ఇవ్వాల్సిన అవసరముందన్నారు. కాంగ్రెసు పార్టీలో ఆమెకు సముచిత స్థానం ఇచ్చామని చెప్పారు. పురంధేశ్వరిని విజయవాడ నుండి పోటీ చేయాలని సూచించామని, విశాఖ టిక్కెట్ కోసమే ఆమె పార్టీ మారారని ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తులపై సంప్రదింపులు జరుపుతున్నామని దిగ్విజయ్ సింగ్ చెప్పారు. సోమవారం తెరాస నేత కె కేశవ రావు ఢిల్లీ వస్తున్నారని, ఆయనతో సంప్రదింపులు జరిపాక నిర్ణయం ఉంటుందని తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు ప్రత్యేక పిసిసిలను ఏర్పాటు చేస్తామన్నారు. పిసిసి ఏర్పాటుపై చర్చలు తుది దశలో ఉన్నాయని చెప్పారు.
టి కాంగ్రెసు ఆగ్రహం
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్కు, ఆ పార్టీకి వెన్నుపోటు పొడిస్తే పురంధేశ్వరి కాంగ్రెసు పార్టీకి వెన్నుపోటు పొడిచారని తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు పొన్నం ప్రభాకర్, రాజయ్యలు మండిపడ్డారు. విభజనకు సహకరించిన బిజెపిలో చేరడాన్ని ఆమె ఎలా సమర్థించుకుంటారో చెప్పాలన్నారు. ఏడెనిమిదేళ్లు పదవులు అనుభవించి ఇప్పుడు పార్టీలు మారారని మండిపడ్డారు.

కాంగ్రెసు పార్టీకి గుడ్ బై చెప్పి బిజెపిలో చేరిన కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరిపై కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి విరుచుకుపడ్డారు. ఎన్టీఆర్ కూతురై ఉండి కూడా ఆయన స్థాపించిన టిడిపిని వదిలి కాంగ్రెస్ పార్టీలో ఏ లాభాపేక్షతో చేరారని ప్రశ్నించారు. ఇప్పుడు మరే ఉద్దేశంతో బిజెపిలో అడుగుపెట్టారని నిలదీశారు. పురంధేశ్వరి నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చారని ఎద్దేవా చేశారు.
ఢిల్లీ చేరుకున్న దామోదర
కాంగ్రెస్ హైకమాండ్ నుంచి పిలుపు మేరకు మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ శనివారం ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. మరికాసేపట్లో పిసిసి మాజీ చీఫ్ ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. రాష్ట్ర విభజన పూర్తైన నేపథ్యంలో తెలంగాణ పిసిసిని హైకమాండ్ నేడు ఖరారు చేయనున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications