తెలియదు: కిరణ్ లేఖపై దిగ్విజయ్, ట్రిబ్యునల్స్
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి లేఖపై తనకు తెలియదని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ అన్నారు. రాష్ట్ర విభజనపై శానససభ తీర్మానం విషయంలో అనుసరించాల్సిన విధివిధానాలపై జోక్యం చేసుకోవాలని కోరుతూ కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి, ప్రధాని మన్మోహన్ సింగ్కు మూడు పేజీల లేఖ రాసిన విషయంతెలిసిందే. ఆ లేఖపై మీడియా ప్రతినిధులు శనివారం ప్రశ్నిస్తే ఆ విషయం తనకు తెలియదని దిగ్విజయ్ సింగ్ సమాధానమిచ్చారు.
ఇదిలావుంటే, రాష్ట్ర విభజనకు సంబంధించి పలు అభ్యంతరకరమైన అంశాలను పరిష్కరించడానికి ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. తెలంగాణకు, సీమాంధ్రకు మధ్య ఉన్న వివాదాస్పద అంశాలను ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేసి పరిష్కారాన్ని వాటికి అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదిలావుంటే, తన లేఖలో కిరణ్ కుమార్ రెడ్డి లేవనెత్తిన అంశాలకు కేంద్ర మంత్రి చిరంజీవి మద్దతు ప్రకటించారు. గతంలో మూడు రాష్ట్రాలను విభజించిన విధంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించాలని కేంద్రమంత్రి చిరంజీవి అన్నారు. విభజన రాజ్యాంగం ప్రకారం చేస్తే.. విభజన తీర్మానాన్ని, బిల్లును రాష్ట్ర అసెంబ్లీకి పంపాలని ఆయన కోరారు. విభజన ప్రక్రియలో కేంద్రం రాజ్యాంగ విరుద్ధంగా వెళ్తోందన్న ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి వ్యాఖ్యలను తాను సమర్థిస్తున్నట్లు చిరంజీవి తెలిపారు.
విభజనను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నామని, రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు చివరి వరకు పోరాడుతామని అన్నారు. సీమాంధ్రుల ఆకాంక్షలను పట్టించుకోకుండా విభజనపై ముందుకెళ్లడం హర్షనీయం కాదని ఆయన చెప్పారు.