విభజన లడాయి: లగడపాటికి దిగ్విజయ్ బుజ్జగింపులు
బుధవారం మధ్యాహ్నం లక్నోలో ఉన్న దిగ్విజయ్ లగడపాటిని అక్కడికి పిలిపించుకుని, సర్దిచెప్పేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. తెలంగాణ నిర్ణయాన్ని మొదటినుంచీ వ్యతిరేకిస్తున్న తీరు అధిష్ఠానం దృష్టిలో పడిందని, కేంద్రమంత్రులతో సహా అనేక మంది ఇతర నేతలు రకరకాల ప్రతిపాదనలు చేస్తుండగా, లగడపాటి ఒక్కరే సమైక్యాంధ్ర ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకోవడం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయని దిగ్విజయ్ చెప్పినట్లు తెలిసింది.
సమైక్యం గురించి మాట్లాడకుండా మౌనంగా ఉంటే చాలునని, రెండు రాష్ట్రాలు ఏర్పడ్డ తర్వాత కీలక బాధ్యతలు అప్పజెబుతామని దిగ్విజయ్ లగడపాటికి చెప్పినట్లు సమాచారం. తాను సైద్ధాంతికంగా సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నానని, ఇప్పుడు ఆ వైఖరి మార్చుకోలేనని లగడపాటి చెప్పారని వార్తాకథనాల సారాంశం.
తనకు కూడా విభజన జరగడం ఇష్టం లేదని, మధ్యప్రదేశ్లో విభజనతో ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నానో తనకు తెలుసునని, అయినా, నేను వ్యక్తిగతంగా ఏమీ చేయలేనని దిగ్విజయ్ సింగ్ లగడపాటితో అన్నట్లు తెలుస్తోంది. మేడమ్ సోనియాగాంధీ, పార్టీ ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత మనమంతా కలిసికట్టుగా అమలు చేయాల్సిందే కదా అని కూడా దిగ్విజయ్ అన్నట్లు చెబుతున్నారు. అయితే, వెనక్కి తగ్గడానికి లగడపాటి ఇష్టపడలేదని అంటున్నారు.