తమ్ముడి బెదిరింపు, కుట్ర: కిరణ్పై దినేష్ రెడ్డి సంచలనం
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైన మాజీ డిజిపి దినేష్ రెడ్డి మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. కిరణ్ తనపై కుట్ర పన్ని పదవి పోయేలా చేశారని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆయనకు ఏమాత్రం ఇష్టం లేదని ఆరోపించారు. జూలై 30న తెలంగాణపై సిడబ్ల్యూసి ప్రకటనకు ముందు సీమాంధ్రలో బలగాలను మోహరించడం కిరణ్కు ఇష్టం లేదన్నారు.

అనంతపురం ఎస్పీ బదలీకి తాను అంగీకరించలేదని చెప్పారు. అలాగే సీమాంధ్ర న్యాయవాదుల సమావేశానికి తాను అనుమతి ఇవ్వకపోవడం కూడా ముఖ్యమంత్రికి ఆగ్రహం తెప్పించిందన్నారు. తనకు కిరణ్ నమ్మక ద్రోహం చేశారని మండిపడ్డారు. రిటైర్మెంటుకు రెండు రోజుల ముందు జివోను విడుదల చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
కిరణ్ మాటను తాను విననందుకే తన పదవిని పొడిగించలేదని ధ్వజమెత్తారు. పోలీసు శాఖ ప్రమోషన్లు అన్ని సిఎం పేషీలోనే అని ఆరోపించారు. కిరణ్ వ్యక్తిగత అజెండాతో వెళ్తున్నారని నిప్పులు చెరిగారు. కిరణ్ సీమాంధ్రకు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారన్నారు.
సిబిఐ కేసును బూచీగా చూపి తనపై కుట్ర చేశారన్నారు. ఆయన మాట విననందుకే తన పదవీ కాలాన్ని పొడిగించలేదన్నారు. తనపై కుట్ర పన్ని తొలగించారన్నారు. ఎందుకు కుట్ర పన్నారో అర్థం కావడం లేదన్నారు. తెలంగాణ వస్తే నక్సల్స్ సమస్య పెరుగుతుందని చెప్పమన్నారని, భూదందాలకు సహకరించాని కిరణ్ తమ్ముడు తనను బెదిరించారని ఆరోపించారు. అతని భూదందాలు అడ్డుకున్నందుకే తనపై కుట్ర పన్నారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications