సదరం శిబిరంలో వికలాంగులు ఇక్కట్లు(ఫోటోలు)
విశాఖపట్నం: వికలాంగులకు పలు విధాలుగా ఉపయోగపడే వైకల్య నిర్దారణ ధ్రువపత్రాలను జారీచేసేందుకు అధికారులు "సదరం" పేరటి విశాఖపట్నంలో కింగ్ జార్జ్ ఆస్పత్రిలో ఓ శిబిరం నిర్వహిస్తున్నారు. గత మూడు రోజులుగా నడుస్తోన్న ఈ శిబిరానికి రోజు వందల సంఖ్యలో వికలాంగులు వస్తున్నారు.
ఐతే ఈ శిబిరం బుధవారంతో ముగిస్తుండటంతో మంగళవారం రాత్రి నుంచి భారీ సంఖ్యలో వికలాంగులు క్యూలో నిలబడ్డారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కొత్తగా ఫించను కోసం దరఖాస్తు చేసుకున్న వికలాంగుల కోసం కేజీహెచ్లో సదరం వైద్య శిబిరాన్ని డి.ఆర్.డి.ఎ నిర్వహిస్తుంది.
ఏయే మండలాల వారు ఎప్పుడెప్పుడు రావోల తేదీలను నిర్ణయించారు. ఆ ప్రకారం వికలాంగులు కేజీహెచ్కు చేరుకుంటున్నారు. ఐతే కేజీహెచ్లో ఈ శిబిరానికి సౌకర్యాలు కల్పించడంపై అధికారులు దృష్టిపెట్టడం లేదు.
రోజులు వంద ధృవపత్రాలు కూడా జారీ చేయలేని పరిస్దితి ఇక్కడ ఉంది. ఐతే నిర్వాహకులు ఐదు రోజుల వ్యవధిలో 5,400 మందికి ధృవపత్రాలు ఇచ్చేందుకు నోటీసులు జారీ చేశారు. కొత్తగా ధృవపత్రాలు దరఖాస్తు పెట్టుకున్న వారితో పాటు గతంలో ధృవపత్రాలు తీసుకున్న వారు కూడా ఈ శిబిరానికి వచ్చారు.
ధృవపత్రాలు పొందేందుకు బుధవారం ఒక్కరోజే ఉండటంతో మంగళవారం రాత్రి అధిక సంఖ్యలో వికలాంగులు కేజీహెచ్కు చేరుకున్నారు. ఇక్కడ రాత్రివేళ ఆస్పత్రి ఆవరణలో కరెంట్ కూడా లేకపోవడంతో కార్ల పార్కింగ్ చేసే షెడ్డులో తల దాచుకున్నారు.
ఇది ఇలా ఉంటే వికలాంగుల బాధలను దృష్టిలో ఉంచుకోని అదనంగా వైద్యులను నియమించాం. మంగళవారం ఒక్కరోజు 350 మందికి ధృవపత్రాలు అందజేశామని కేజీహెచ్ పర్యవేక్షణ అధికారి డాక్టర్ మధుసూధనబాబు తెలిపారు.