TTD: తెలంగాణ ప్రజాప్రతినిధులపై ఎందుకీ వివక్ష..!
తెలంగాణ ప్రజాప్రతినిధుల పట్ల టీటీడీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే టీటీడీ తీరుపై మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ గౌడ్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీకి చెందిన వారి సిఫార్సు లేఖలను తెలంగాణలో అన్ని దేవాలయాల్లో అనుమతిస్తున్నామని.. కానీ తమ సిఫార్సు లేఖలను టీటీడీలో అనుమతించడం లేదని చెబుతున్నారు. అన్నదమ్ములమని చెబుతూనే వివక్ష చూపిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
తెలంగాణలో ఎంతో మంది ఆంధ్ర సెటీలర్లు ఉన్నారని గుర్తు చేశారు. హైదరాబాద్ దాదాపు సగం మంది ఏపీకి చెందిన వారే ఉన్నారని.. వారిని సోదరులుగా చూసుకుంటున్నామని.. అయినప్పటికీ టీటీడీ పక్షపాతం చూపడం సరైంది కాదని చెబుతున్నారు. తమకు కూడా గౌరవం ఇవ్వాలన్నారు. టీటీడీ వారానికి రెండు సార్లు తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను స్వీకరిస్తుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై విస్తృత ప్రచారం కూడా జరిగింది.

కానీ.. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని టీటీడీ ఈవో శ్యామల రావు స్పష్టం చేశారు. టీటీడీ బోర్డులో ఐదుగురు తెలంగాణకు చెందిన వారు ఉన్నారు. అయినప్పటికీ సిఫార్సు లేఖలపై టీటీడీ నిర్ణయం తీసుకోలేదు. దీనిపై టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు ఆలోచనల చేయాలని పలువురు సూచిస్తున్నారు. టీటీడీ పాలకమండలిలో మొత్తం 25 మంది సభ్యులు ఉన్నారు.
వీరిలో తెలంగాణ నుంచి ఐదుగురు, కర్ణాటక నుంచి ముగ్గురు, తమిళనాడు నుంచి ఇద్దరు, గుజరాత్, మహారాష్ట్రాల నుంచి ఒక్కొక్కరి చొప్పున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలంగాణ వారికి సముచిత ప్రాధాన్యం కల్పించినా.. ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదో తెలియడం లేదని పలువురు తెలంగాణ టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications