మహిళల భద్రత "దిశ"గా..పెరిగిన చొరవ..బాపట్లలో డౌన్లోడ్ల రికార్డు!
అమరావతి: గుంటూరు జిల్లాకు చెందిన పలువురు క్షుద్రపూజల పేరుతో మహిళలను తమ వశం చేసుకోవడానికి ప్రయత్నించారు. ఈక్రమంలో వారు మహిళలను తీసుకుని అత్యాచారం చేసేందుకు ప్రయత్నిస్తుండగా.. ఆ మహిళలు వెంటనే దిశ యాప్కు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు వెంటనే అలెర్ట్ అయ్యి వారిని రక్షించారు.
తాజాగా దిశ పోలీసులు చేసిన మరో మంచికి సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి. పది రోజుల వ్యవధిలో మూడు బాల్య వివాహాలను వారు అడ్డుకోవడం విశేషం. ఈ ఏడాది మే 26న అనంతపురం జిల్లా రాయదుర్గంలో బాల్యవివాహం జరుగుతున్నట్టు ఓ వ్యక్తి ఫోన్ చేసి దిశ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు శిశు సంక్షేమ శాఖ, మహిళా అభివృద్ధి అధికారులతో కలిసి ఘటనా స్థలికి వెళ్లి వివాహాన్ని నిలిపివేశారు.

మరో ఘటన మే 28న కృష్ణా జిల్లా పెనమలూరు కూడా ఓ చిన్నారి పెళ్లికూతురు తనకు బలవంతంగా పెళ్లి చేస్తున్నారంటూ దిశ పోలీసులుకు తెలిపింది. దాంతో వెంటనే మండపానికి చేరుకున్న పోలీసులు ఆ వివాహాన్ని ఆపేశారు. అదేవిధంగా ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం వెంకటాపురంలో జూన్ 5న ఇంటర్మీడియట్ విద్యార్థిని వివాహాన్ని దిశ పోలీసులు అడ్డుకున్నారు. జూన్ 8న వీరి వివాహం జరగాల్సి ఉంది. తనకు ఇష్టం లేకపోయినా తల్లిదండ్రులు బలవంతంగా పెండ్లి చేస్తున్నారంటూ బాలిక చెప్పడంతో.. అధికారులు వారికి కౌన్సెలింగ్ ఇచ్చి అమ్మాయి పెంళ్లి ఆపేశారు.
ఇలా పైన చెప్పుకున్న ఘటనలు కొన్నే.. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎందరో మహిళలు దిశ యాప్ను విరివిగా ఉపయోగించుకున్నారు. ఆపదలో ఉన్న మహిళలు, యువతులను రక్షించేందుకు ఆంధ్రప్రదేశ్లో దిశ యాప్ను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ యాప్లో అధునాత సాంకేతికతను జోడించడంతో అనతి కాలంలోనే ప్రజాదరణ పొందింది.
అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతోమంది మహిళలు, యువతులను సురక్షితంగా ఉంచడంతో యాప్ తోడ్పాటు అందించిందని చెప్పవచ్చు. రాష్ట్రంలో ఎన్నో అవాంఛనీయ ఘటనలను అడ్డుకుని ప్రజల మెప్పు పొందింది. ఈక్రమంలో పోలీసు శాఖ ఈ నెల 14, 15వ తేదీలో యాప్ డౌన్లోడ్పై ప్రత్యేకమైన డ్రైవ్లు చేపట్టడంతో రికార్డు స్థాయిలో స్పందన వచ్చింది. ఈ వివరాలు ఇలా ఉన్నాయి.

ఇప్పటి వరకు 3 కోట్లకు పైగా డౌన్లోడ్లు..
దిశ యాప్ వెబ్సైట్లో అప్డేట్ చేసిన ప్రకారం.. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు.. 3 కోట్ల 94 లక్షల మంది యాప్ను వినియోగిస్తున్నారని అధికారికంగా పేర్కొన్నారు. ఇక తాజాగా.. ఈ యాప్ డౌన్లోడ్ కార్యక్రమం మరో దఫా ఈ నెల 14, 15 తేదీల్లో ఏపీలోని అన్ని జిల్లాల్లో జరిగింది. అయితే.. బాపట్ల జిల్లాలో రికార్డు స్థాయిలో డౌన్లోడ్లు జరిగినట్లు ఈ నెల 15న జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. రెండు రోజుల్లో దాదాపు 12000 మంది యాప్ను డౌన్లోడ్ చేసుకునేలా ప్రోత్సహించామన్నారు.
ఇక డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలో అమలాపురం డీఎస్పీ అంబికాప్రసాద్ వినూత్నంగా యాప్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అమలాపురంలోని సీఎంఆర్ షాపింగ్మాల్, చెన్నై ఎంజీఆర్ మాల్, చందన బ్రదర్స్లలో ఎక్కడైనా దిశ యాప్ డౌన్లోడ్ చేసుకుని రిజిస్ర్టేషన్ చేయించుకుంటే వస్త్రాల కొనుగోళ్లపై 15శాతం రాయితీ ఇవ్వడానికి ఆయా సంస్థల యాజమాన్యాలు ముందుకు వచ్చినట్టు డీఎస్పీ చెప్పారు.

మరీ ముఖ్యంగా యువతులు, మహిళలు దిశా యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. దీంతో మహిళలు సైతం పెద్దఎత్తున యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు. ఇలా ప్రభుత్వం చొరవతో దిశను యాప్ సేవలను మహిళలు వినియోగించుకుంటూ.. రక్షణ పొందుతున్నారు. ఈ యాప్ తీసుకొచ్చినందుకు వారందరూ ధన్యవాదాలు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications