వైఎస్ మనుషులకే పెద్ద పీట: బాబు వ్యూహమా, భయమా...
వచ్చే ఎన్నికల్లో జగన్ను దెబ్బ తీసి, రాయలసీమలో పాగా వేయడానికి వీలుగా చంద్రబాబు మంత్రివర్గాన్ని పునర్వ్యస్థీకరించినట్లు కనిపిస్తోంది. అయితే, ఆయనకు తన సొంత వర్గం నుంచి నిరసన ఎదురవుతోంది.
విజయవాడ: మంత్రి పదవి ఆశించి భంగపడిన తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి మంత్రివర్గ పునర్వ్యస్థీకరణపై ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. మంత్రివర్గం ఏ పార్టీదో తెలియడం లేదనేది ఆ వ్యాఖ్య.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి గెలిచి టిడిపిలోకి వచ్చిన నలుగురికి మంత్రివర్గంలో చంద్రబాబు చోటు కల్పించారు. పైగా దాదాపుగా చాలా మంది గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి మనుషులుగా ముద్రపడినవారే. అంతేకాకుండా చంద్రబాబు, నారా లోకేష్ చుట్టూ ఉండేవారికే మంత్రి పదవులు దక్కాయనే విమర్శలు సొంత పార్టీ నుంచే వస్తున్నాయి.
మంత్రివర్గ కూర్పులో రెడ్లకు, రాయలసీమ ప్రాంతానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంలో చంద్రబాబు రాజకీయ వ్యూహం మరో రకంగా ఉండవచ్చు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ను వచ్చే ఎన్నికల్లో దెబ్బ కొట్టాలంటే అది తప్పదని ఆయన అనుకుని ఉండవచ్చు. కానీ, పార్టీకి విధేయులుగా ఉంటూ, జగన్ను ఎప్పటికప్పుడు ఎదుర్కుంటూ వస్తున్నవారిని చంద్రబాబు విస్మరించారనే అభిప్రాయం బలంగా ఉంది. దానికితోడు, చంద్రబాబు కమ్మ సామాజిక వర్గాన్ని విస్మరించారనే విమర్శలు వస్తున్నాయి.
సోషల్ మీడియాలో ఆ రకంగా....
చంద్రబాబు మంత్రివర్గం కూర్పు, శాఖల కేటాయింపు జరిగిన తీరుపై కమ్మ సామాజిక వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇందుకు సంబంధించిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్న తమ వర్గీయులను మంత్రివర్గంలోకి తీసుకోకుండా, తిరిగి శాఖల కేటాయింపులోనూ తమ వర్గానికి చెందిన ఇద్దరు మంత్రులకు అప్రాధాన్యమైన శాఖలు ఇవ్వడంపై కమ్మ సామాజికవర్గం అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇప్పటి వరకు రాజీనామాలు చేస్తామన్నవారు...
మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంపై అసంతృప్తికి గురై రాజీనామాలు చేస్తామని ప్రకటించిన బుచ్చయ్యచౌదరి, చింతమనేని ప్రభాకర్, అలక వహించిన ధూళిపాళ్ల, అసంతృప్తితో ఉన్న పయ్యావుల కేశవ్ అదే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం విశేషం. మిగిలిన సామాజికవర్గ నేతలు అసంతృప్తి వ్యక్తం చేసినా వారెవరూ వీధిన పడలేదు. కేవలం వాళ్లిద్దరూ ఉంటే సరిపోతుందా? అంటూ సోషల్మీడియాలో ఆ సామాజికవర్గం తన అసంతృప్తి, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది.
బాబు, లోకేష్లపై అసంతృప్తి
కోస్తా, అనంతపురం జిల్లాలకు చెందిన కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకులు చంద్రబాబు, నారా లోకేష్ కలసి తీసుకున్న నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పదేళ్లు ప్రతిపక్షంలో ఉండి పూర్తిగా నష్టపోయిన తమను ప్రోత్సహించేందుకు బదులు చంద్రబాబు ఇతర వర్గాలను చూసి చంద్రబాబు భయపడుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు, లోకేష్ చుట్టూ ఉన్న పారిశ్రామికవేత్తలు, అధికారులైన కొందరు కమ్మ సామాజికవర్గానికి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చారని, క్షేత్రస్థాయిలో జెండా మోసిన వారికి గుర్తింపు దక్కలేదని అంటున్నారు.
వారికి అన్ని పదవులా...
ఎమ్మెల్యేలలో ఐదు శాతం ఉన్న రెడ్లకు నాలుగు మంత్రి పదవులివ్వడంతోపాటు, వారికి కీలక శాఖలివ్వడంపైనా తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. శాఖల కేటాయింపులో కూడా తమ వర్గం పట్ల వివక్ష ప్రదర్శించారన్న విమర్శలు కమ్మ సామాజిక వర్గం నుంచి వ్యక్తమవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ఓ వర్గం పార్టీ అనే అభిప్రాయాన్ని తొలగించడంతో పాటు రాయలసీమలో బలం పుంజుకోవడానికి రెడ్డి సామాజిక వర్గానికి చంద్రబాబు పెద్ద పీట వేసి ఉంటారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.
వారి శాఖల మార్పు ఇలా...
పరిటాల సునీతకు పౌరసరఫరాల శాఖ తప్పించి ప్రాధాన్యం లేని మహిళా సాధికారికత, శిశు సంక్షేమం, వృద్ధుల సంక్షేమం; పత్తిపాటి పుల్లారావును వ్యవసాయశాఖ నుంచి తప్పించి ధరల నియంత్రణ వంటి శాఖలు కేటాయించడంపై నిరసన వ్యక్తమవుతోంది. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెడ్డి వర్గానికి ఎన్ని పదవులిచ్చారు.. అప్పుడు ఆయనేమైనా చంద్రబాబు మాదిరిగా భయపడ్డారా అనే ప్రశ్నలు వస్తున్నాయి.
వారు పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు
చంద్రబాబు, నారా లోకేష్ చుట్టూ ఉన్న కమ్మ సామాజిక వర్గానికి చెందినవారికి సొంత వర్గంతో సంబంధాలు లేవని, వారంతా వ్యాపారస్తులని అంటున్నారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన దగ్గరున్న వాళ్లే మళ్లీ ఇప్పుడు ఇటొచ్చారని, వాళ్లకు పనులుకావాలని, ప్రభుత్వాలతో పనిలేదని అంటున్నారు. కానీ మేం పార్టీ కోసం పనిచేసే వాళ్లమని, ఆ తేడా ఎవరూ గుర్తించడం లేదని, అనవసరంగా మాపై కమ్మ ముద్రపడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.