రావాల్సిన అవసరం లేదు: జగన్ పార్టీ, అశోక్కు ఝలక్
హైదరాబాద్/న్యూఢిల్లీ: వర్షంతో కకావికలమైన ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొంటున్న తమ పార్టీ కార్యకర్తలు శనివారం హైదరాబాదులో నిర్వహించనున్న సమైక్య శంఖారావ సభకు రావాల్సిన అవసరం లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు కొణతాల రామకృష్ణ శుక్రవారం సూచించారు.
తుపాను కంటే విభజన సమస్య చాలా తీవ్రమైందన్నారు. విభజన సమస్య తీవ్రత దృష్ట్యా సమైక్య శంఖారావం యథాతథంగా నిర్వహించేందుకు నిర్ణయించుకున్నామన్నారు. అయితే సహాయ చర్యల్లో పాల్గొంటున్న తమ పార్టీ కార్యకర్తలు మాత్రం సభకు రావాల్సిన అవసరం లేదన్నారు. విభజన నిర్ణయం నేపథ్యంలో ఢిల్లీ గద్దెను కదిలించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అందుకే తాము సభను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

అశోక్ బాబుకు అనుమతి నిరాకరణ
ఎపిఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబును అసెంబ్లీలోకి అనుమతించేందుకు సెక్యూరిటీ సిబ్బంది నిరాకరించారు. ఉద్యోగుల సమస్యలపై శాసన సభ కార్యదర్శితో గురువారం మాట్లాడేందుకు అశోక్ బాబు ముందుగా అనుమతి తీసుకున్నా అసెంబ్లీకి ఆలస్యంగా వచ్చారు. అప్పటికే కార్యదర్శి బయటకు వెళ్లేందుకు సిద్ధమవడంతో చేసేదేమీలేక వెనుదిరిగారు.
గవర్నర్తో సీమాంధ్ర కాంగ్ నేతల భేటీ
న్యూఢిల్లీలో ఉన్న రాష్ట్ర గవర్నర్తో సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ ప్రజాప్రతినిధులు శుక్రవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు తమకు ఎలాంటి ప్యాకేజీలు వద్దని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరారు. అసెంబ్లీకి తీర్మానం వచ్చేలా చూడాలని కోరారు.












Click it and Unblock the Notifications