సురేఖను నట్టేట ముంచావ్, టి వ్యతిరేకి: జగన్పై అరుణ
మహబూబ్ నగర్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తనను నమ్మిన మాజీ మంత్రి కొండా సురేఖ వంటి వారిని నట్టేట ముంచారని మంత్రి డికె అరుణ మంగళవారం మండిపడ్డారు. మహబూబ్ నగర్ జిల్లా గద్వాలలో కాంగ్రెసు పార్టీ జైత్రయాత్ర సభను నిర్వహించింది. ఇందులో డికె అరుణ మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, వైయస్ జగన్ల పైన ఆమె మండిపడ్డారు.
విభజనపై కాంగ్రెసు పార్టీ రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణయం కాదన్నారు. అరవయ్యేళ్ల తెలంగాణ ప్రజల కలను సాకారం చేసిన ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి తాను ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. ఎవరెన్ని ఊసరవెల్లి వేషాలు వేసినా తెలంగాణ ఏర్పాటు ఆగదన్నారు. జగన్ ముప్పై సీట్లను, చంద్రబాబు సమన్యాయం అంటూ సీమాంధ్ర ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. నీళ్ల సమస్యలు వస్తాయని చెప్పడం సరికాదన్నారు.

ఢిల్లీ అహంకారానికి, తెలుగు వాళ్లకు మధ్య పోరాటమని జగన్ ఇటీవల హైదరాబాదులో నిర్వహించిన సమైక్య సభలో అంటున్నారని, అంటే ఆయన దృష్టిలో తెలంగాణ ప్రజలు తెలుగు వాళ్లు కాదా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవం వద్దా అన్నారు. రాజకీయ మనుగడ కోసమే తెలంగాణ ఆపుతామని సీమాంధ్ర ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, జగన్ ఎంపీగా పోటీ చేసినప్పుడు సోనియా ఇటలీ దేశస్థురాలని తెలియదా చెప్పాలన్నారు.
సోనియాది ఇటలీ దేశం అని జగన్కు ఈ రోజు గుర్తుకు వచ్చిందా అన్నారు. కొండా సురేఖ జగన్ కోసం మంత్రి పదవిని, ఎమ్మెల్యే పదవిని, ఆమె భర్త ఎమ్మెల్సీ పదవిని త్యాగం చేశారని, అలా వెంట నడిచిన వాళ్లను జగన్ నట్టేట ముంచారన్నారు. జగన్ పక్కా తెలంగాణ వ్యతిరేకి అని అర్థమైపోయిందన్నారు. ఆ పార్టీలోని తెలంగాణ నేతలు బయటకు రావాలన్నారు. తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయడమే జగన్ లక్ష్యమా అని ప్రశ్నించారు.
చంద్రబాబు విభజనపై రోజుకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు పాలమూరును దత్తత తీసుకున్న చంద్రబాబు ఎడారిగా మార్చారన్నారు. అరవయ్యేళ్ల ఉద్యమం తర్వాత తెలంగాణ వచ్చిందన్నారు. కెసిఆర్ ప్రజలను మభ్యపెట్టవద్దన్నారు. కాంగ్రెసు నేతల ప్రయత్నం ఫలితంగానే తెలంగాణ వచ్చిందన్నారు. అరవయ్యేళ్ల ఉద్యమంలో కెసిఆర్ కూడా పాత్ర పోషించారే తప్ప తెలంగాణ సాధ్యమైంది మాత్రం కాంగ్రెసు నేతల వల్లే అన్నారు. ప్రజలకు మేలు చేయని రాజకీయాలు మానుకోవాలని విపక్షాలకు హితవు పలికారు.












Click it and Unblock the Notifications