క్షీణిస్తున్న ముద్రగడ ఆరోగ్యం, జగన్ దారిలోకి రాని కాపు నేత!
రాజమహేంద్రవరం: కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైద్య పరీక్షలకు నిరాకరిస్తున్నారని రాజమండ్రి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్ కిషోర్ సోమవారం నాడు వెల్లడించారు. అయితే ముద్రగడ సతీమణి, కొడుకు, కోడలుకు వైద్య పరీక్షలు నిర్వహించామని చెప్పారు.
కాపు గర్జన సమయంలో జరిగిన తుని విధ్వంసం ఘటనలో పోలీసులు పదమూడు మందిని అరెస్టు చేశారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో అమాయకులు ఉన్నారని, వారిని విడుదల చేయాలని ముద్రగడ డిమాండ్ చేస్తూ దీక్షకు దిగిన విషయం తెలిసిందే.
ముద్రగడ పద్మనాభం రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో దీక్షను కొనసాగిస్తున్నారు. దీని పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్న కాపు యువత చలో రాజమహేంద్రవరంకు పిలుపునిచ్చారు. మరోవైపు, ముద్రగడ దీక్షా ప్రాంగణంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

జగన్ దారికి రాని ముద్రగడ!
తుని విధ్వంసం పైన సీబీఐతో విచారణ జరిపించాలని ఏపీలోని విపక్ష నాయకులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎంపీ చిరంజీవి తదితరులు డిమాండ్ చేశారు. చంద్రబాబు సీబీఐ విచారణకు సిద్ధమని ప్రకటించారు. అయితే, ముద్రగడ మాత్రం సీబీఐ నో చెబుతున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.
తుని ఘటన పైన సీబీఐ విచారణకు సిద్ధమని చంద్రబాబు ప్రకటన చేసినా కూడా ముద్రగడ దీక్ష విరమించక పోవడాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ అంశంలో జగన్ - ముద్రగడలు వేరు అయ్యారని అంటున్నారు.
ముద్రగడ వెనుక జగన్ ఉన్నారనే వాదన చాలా రోజుల నుంచి ఉంది. తుని ఘటనను సిబిఐతో విచారణ జరిపించాలని జగన్ ఒకటికి రెండుసార్లు డిమాండ్ చేశారు. చిరంజీవి కూడా అదే డిమాండ్ చేశారు. కానీ ముద్రగడ మాత్రం సిబిఐ విచారణకు సిద్ధమని ప్రకటించినా తగ్గటం లేదు.












Click it and Unblock the Notifications