స్వామి వారి సేవకు రేపటి నుంచి: డాలర్ శేషాద్రి
తిరుపతి: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సేవకు రేపటి నుంచి అంకితమవుతానని టీటీడీ డాలర్ శేషాద్రి వెల్లడించారు. ఆ స్వామి వారే తనకు పునర్జన్మ కల్పించారని.. ఆయన ఆశీస్సులతో ప్రాణాలతో బయటపడ్డానని తెలిపారు.
బ్రహ్మోత్సవాల సందర్బంగా ఈ నెల ఒకటో తేదీన గుండెపోటుకు గురైన తాను.. దాదాపు 30 గంటలు అపస్మారక స్దితిలో ఉన్నానని డాలర్ శేషాద్రి గుర్తు చేశారు. ఆ సమయంలో టీటీడీ అధికారులు అండగా నిలిచారని, వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.
గత నలభై ఏళ్లుగా స్వామి వారి సేవలో ఉన్నానని చెప్పారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 6వ రోజు తీవ్ర గుండెపోటుకు గురైన శేషాద్రికి అపోలోలో డాక్టర్లు చికిత్స అందించడంతో... పూర్తిగా కోలుకోవడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయి సోమవారం రాత్రి తిరుపతికి చేరుకున్నారు. దీంతో తిరుపతిలో డాలర్ శేషాద్రికి పెద్ద జీయర్ స్వామి, జేఈవో శ్రీనివాసరాజు, ఆలయ డిప్యూటీ ఈవో రమణ పరామర్శించారు.
తిరుమలలో ప్రస్తుతం డాలర్ శేషాద్రి ఆఫీసర్ ఆన్ డ్యూటీ బాధ్యతలను నిర్వహిస్తున్నాడు. 2006 నుంచి పొడగింపుపై ఆయన పదవిలో కొనసాగుతున్నారు. 2014లో ఆయన పదవిని పొడిగిస్తూ తిరుమల తిరుపతి దేవస్దానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎమ్ జీ వేణుగోపాల్ నిర్ణయం తీసుకున్నారు.