శివ ఎన్కౌంటర్: వణికిపోయి ఎల్లంగౌడ్ సరెండర్
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో జరిగిన రెండు ఎన్కౌంటర్ల నేపథ్యంలో పేరు మోసిన నేరస్థుడు ఎల్లంగౌడ్ భయపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గజదొంగ శివ అలియాస్ సాంబ పోలీసు కాల్పుల్లో మరణించడం అతన్ని భయానికి లోను చేసినట్లు చెబుతున్నారు. నకిలీ కరెన్సీ చెలామణి ముఠాకు నాయకత్వం వహిస్తున్న ఎల్లంగౌడ్ పోలీసు కానిస్టేబుల్ను హత్య చేసిన కేసులో అరెస్టు చేశారు.
నిజానికి, అతను మంగళవారంనాడు పోలీసుల ముందు లొంగిపోయినట్లు చెబుతున్నారు. అతన్ని సైబరాబాద్ పోలీసులు విచారించారు. తనను ఎన్కౌంటర్ చేయవద్దని పోలీసులను, ప్రభుత్వాన్ని ఎల్లంగౌడ్ వేడుకున్నట్లు వార్తలు వచ్చాయి.
ఎన్కౌంటర్ అవుతాననే భయంతోనే ఎల్లంగౌడ్ పోలీసు ముందు లొంగిపోయినట్లు భావిస్తున్నారు. పోలీసు కానిస్టేబుల్ను దారుణంగా హత్య చేసిన తర్వాత పలు పోలీసు బృందాలు అతని కోసం, అతని అనుచరుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి.
మహరాష్ట్రలో దాక్కున్న ఎల్లంగౌడ్ చివరకు లొంగిపోగా, పోలీసులు అరెస్టు చేశారు. ఎల్లంగౌడ్ అనుచరుడు శ్రీధర్ను పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఎల్లంగౌడ్, అతని అనుచరులు ఆగస్టు 1వ తేదీ రాత్రి షామీర్పేట వద్ద బాలానగర్ పోలీసు బృందంపై దాడి చేశారు. ఈ దాడిలో ఓ పోలీసు కానిస్టేబుల్ కత్తిపోట్లకు గురై మరణించగా, ఓ సబ్ ఇన్స్పెక్టర్ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
సంఘటనా స్థలంలోనే పోలీసులు ఎల్లంగౌడ్ అనుచురుడిని ఒకతన్ని కాల్చి చంపారు. మెదక్ జిల్లాలోని సిద్ధిపేటకు చెందిన ఎల్లంగౌడ్పై పలు కేసులు ఉన్నాయని సమాచారం. సిద్ధిపేట, ఖమ్మం, నల్లగొండ, జహీరాబాద్ తదితర ప్రాంతాల్లో అతనిపై దోపిడీ, దొంగతనాలు, దాడులకు సంబంధించిన కేసులు పెండింగులో ఉన్నట్లు తెలుస్తోంది.