చేయని తప్పుకు నింద మోస్తున్న చంద్రబాబు..!
ఏపీ సీఎం చంద్రబాబును కష్టాలు వెంటాడుతున్నాయి. ఓవైపు పార్టీ ఫిరాయింపులపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఎండగడుతుంటే.. మరోవైపు కరువు కూడా ఆయన పట్ల ప్రతిపక్షం పాత్రనే పోషిస్తోంది. చంద్రబాబు నాయుడు దురదృష్టమో.. మరేమో గానీ ఆయన అధికారంలోకి వచ్చిన ప్రతీసారి కరువు కూడా కక్ష గట్టినట్టే వ్యవహరిస్తోంది. దీంతో కరువు, చంద్రబాబు పక్క పక్కనే ఉంటాయని అభిప్రాయపడుతూ ఈ ఇద్దరిని కవలల పిల్లలతో పోలుస్తున్న విషయం తెలిసిందే.
కరువుకు కారణం చంద్రబాబేనని ఆరోపణలు చేస్తున్నవారికి ఇప్పుడింకో కొత్త ఊతం దిరికినట్టయింది. తాజాగా శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 780 అడగుల దిగువకు చేరుకుంది. దీంతో లోపల ఉన్న పురాతన కట్టడాలు బయటపడుతున్న పరిస్థితి. గతంలో సరిగ్గా 12 ఏళ్ల క్రితం ఇదే చంద్రబాబు హయాంలొ బయటపడ్డ పురాతన మండపం ఒకటి తాజా కరువుకు నీటి మట్టం పడిపోవడంతో మళ్లీ బయటపడింది.
గడిచిన 12 ఏళ్లుగా బయటపడని మంటపం.. ఇప్పుడు బయటపడేసరికి, ఆ నిందను కాస్త పాపం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మీదకు నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది. స్థానికులు కూడా చంద్రబాబు హయాంలోనే మంటపం బయటపడడంపై పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. ఏదేమైనా ఇదంతా చూస్తుంటే చేయని తప్పుకు చంద్రబాబుకు నిందలు తప్పట్లేదనే వాదన వినిపిస్తోంది.