తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు: సీమాంధ్రులపై డిఎస్
వరంగల్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై సీమాంధ్ర నాయకులు పార్టీ అధిష్టానాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని పిసిసి మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ విమర్శించారు. తెలంగాణలోని సీమాంధ్రులంతా తమ కుటుంబ సభ్యులేనని, వారికి ఏ విధమైన ఆందోళనలు అక్కరలేదని ఆయన అన్నారు. వరంగల్లో శనివారం జరిగిన కాంగ్రెసు కృతజ్ఞతా సభలో ఆయన ప్రసంగించారు. అందరి కృషి ఫలితంగానే తెలంగాణ ఏర్పాటవుతోందని ఆయన చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కాంగ్రెసు ప్రజాప్రతినిధులంతా విశ్వప్రయత్నాలు చేశారని ఆయన చెప్పారు. 2000ల నుంచి తమ పార్టీ తెలంగాణ కోసం ప్రయత్నాలు చేస్తోందని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తానని తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అప్పుడే హామీ ఇచ్చారని ఆయన చెప్పారు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల విలీనం తర్వాత జరిగిన ఒప్పందాల్లో ఏ ఒక్కదాన్ని కూడా సీమాంధ్ర నాయకులు నెరవేర్చలేదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత కాంగ్రెసుపైనే ఉందని ఆయన అన్నారు.
హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తే సహించబోమని మంత్రి డికె అరుణ అన్నారు. తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వల్లనే 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరిందని మరో మంత్రి సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. అంతర్గత విమర్శలు మాని సీమాంధ్ర నాయకుల కుట్రలను తిప్పికొట్టాలని పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి పిలుపునిచ్చారు.
తెలంగాణ డిమాండ్ కాంగ్రెసు పార్టీదేనని మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. 2000లలోనే తాము తెలంగాణ డిమాండ్ను వినిపించామని ఆయన అన్నారు. ఆ ఘనతను ఇంకెవరో కొట్టేయాలని చూస్తున్నారని ఆయన అన్నారు.ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ ద్రోహి అని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి రచ్చబండలో చెప్పింది వేరు, ఆచరిస్తోంది వేరని ఆయన అన్నారు. సీమాంధ్ర నాయకులు అక్రమాస్తుల రక్షణకే హైదరాబాదు గురించి మాట్లాడుతున్నారని, తెలంగాణలోని సీమాంధ్రుల గురించి మాట్లాడడం లేదని పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ అన్నారు.
తెలంగాణకు అన్ని పార్టీలు మొదట అంగీకారం తెలిపాయని, కాంగ్రెసు నిర్ణయం తీసుకుని ప్రకటించిన తర్వాత కొన్ని పార్టీలు యూటర్న్ తీసుకున్నాయని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు సోనియా తెలంగాణ ఏర్పాటు నిర్ణయాన్ని తీసుకోలేదని, రాహుల్ను ప్రధానిని చేయాలలుకుంటే సోనియాకు ఏ మాత్రం సమయం పట్టదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్తో పార్టీ శాసనసభ్యులను వైయస్ రాజశేఖర రెడ్డి సోనియా వద్దకు పంపించారని, ఆ విషయం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మరిచిపోయారని ఆయన అన్నారు.