DSC 2025: కాల్ లెటర్లు అందని వారి కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం..!!
Mega DSC-2025: మెగా డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలనలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాల్ లెటర్ల విషయంలోనూ కొంత అయోమయం నెలకొంది. కాగా, 16,347 పోస్టులకు గాను 15,340 కాల్ లెటర్లను అభ్యర్ధులకు అధికారులు లాగిన్ లో ఉంచారు. ఈ రోజు (శుక్రవారం) మధ్యాహ్నం వరకు సర్టిఫికెట్ల పరిశీలన కొనసాగనుంది. అవసరం మేరకు రానున్న రెండు రోజులు పత్రాల పరిశీలన చేసి.. సోమవారం మిగిలిన పోస్టుల కాల్ లెటర్లను విడుదల చేయాలని నిర్ణయించారు. కాగా, కొన్ని పోస్టులు మిగిలిపోనున్నాయి.
డీఎస్సీ నియామకాల వ్యవహారంలో ఆసక్తి కర అంశాలు బయటకు వస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో అభ్యర్ధులు లేక పోస్టులు మిగిలిపోయే పరిస్థితి ఏర్పడినట్లు అధికారులు గుర్తించారు. కర్నూలు జిల్లాలో ఎస్సీ కేటగిరీ-1 లో రెల్లి సామాజిక వర్గం అభ్యర్ధులు లేరు. దీంతో, ఈ పోస్టులు మరో డీఎస్సీకి మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా మరి కొన్ని జిల్లాల్లోనూ పోస్టులు మిగలనున్నట్లు అధికారులు చెబుతున్నారు. కొందరు అభ్యర్ధుల తప్పిదాల కారణంగా సర్టిఫికెట్ల పరిశీలనలోనే తిరస్కరణకు గురయ్యాయి. కొందరు అభ్యర్ధులు మాజీ సైనికోద్యోగులుగా పేర్కొన్నారు. కాగా, రిజర్వేషన్ అభ్యర్ధుల ఎంపికలోనూ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరైన వారిలో 600 మంది వరకు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉందని సమాచారం.

ఇక, ఈ రోజు సర్టిఫికెట్ల పరిశీలన తరువాత దీని పైన విద్యా శాఖ కీలక ప్రకటన చేయనుంది. ఇదే సమయంలో సర్టిఫికెట్ల పరిశీలన తరువాత రిజర్వేషన్ల వారీగా అభ్యర్ధుల ఎంపిక జాబితాను పాఠశాల విద్యా శాఖ విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. వారం రోజుల్లో ఈ జాబితా విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. కటాఫ్ మార్కులతో పాటు ఎంపికైన అభ్యర్ధుల జాబితాలను పారదర్శకంగా విడుదల చేయనున్నట్లు వివరించారు. సర్టిఫికెట్ల పరిశీలనలో జాప్యం పైన అభ్యర్ధుల్లో కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో.. అధికారులు ఈ వివరణ ఇచ్చారు. వారంలోకా పూర్తి ప్రక్రియ పూర్తి చేసే లక్ష్యంగా అధికారులు నిర్ణయాలు తీసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications