ఏం పాపం చేశాం: దూళిపాళ్ల, పోచారం శాపనార్థాలు
హైదరాబాద్: సీమాంధ్ర ప్రాంత ప్రజల హక్కులను హరించే విధంగా కేంద్రం వైఖరి ఉందని, ఈ రాష్ట్రం ఏం పాపం చేసిందని సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర మంగళవారం మండిపడ్డారు. ఉదయం అసెంబ్లీ ప్రారంభమైన కాసేపటికే ఇరు ప్రాంతాల నేతల ఆందోళనతో వాయిదా పడింది. మండలి కూడా కాసేపటికే వాయిదా పడింది. అనంతరం దూళిపాళ్ల మీడియా పాయింటు వద్ద మాట్లాడారు.
ప్రభుత్వంలో ఉన్న మంత్రులు చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. కోట్లమంది ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన బిల్లు అని, సభలో ఓటింగ్ ద్వారానే సభ్యుల అభిప్రాయాలు తెలుస్తాయన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బిఏసి సమావేశంలో ఒకటి, బయట మరొకటి మాట్లాడుతున్నారన్నారు. బిల్లును పునఃపరిశీలించాలని, సమైక్యంపై తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. సమైక్యవాదులుగా బిఏసి సమావేశంలో తమ అభిప్రాయం చెప్పామన్నారు.
కెసిఆర్కు మోత్కుపల్లి సవాల్
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు సవాల్ చేశారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీకి చెందిన వారమంతా తమ భూములను కెసిఆర్కు కౌలుకు ఇస్తామని, ఆయన పంట పండించి కోటి సంపాదించి, తమకు లక్ష రూపాయలు ఇస్తే చాలని, తొంబై తొమ్మిది లక్షలు ఆయన ఉంచుకోవచ్చునన్నారు.
దీనిపై తాను కెసిఆర్కు లేఖ రాస్తానన్నారు. మేమంతా భూములిస్తామని, కౌలుకు తీసుకునేందుకు ఆయన సిద్ధమా అన్నారు. కాగా, భారతీయ జనతా పార్టీ నేత, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డి టిడిపి నేత మోత్కుపల్లితో లాబీల్లో మాట్లాడుతూ... బిల్లుపై సవరణలు కోరవద్దని, అలా అయితే ఓటింగ్ జరిగే అవకాశముంటుందని సూచించారు.
ఉసురు తగులుతుంది: పోచారం
తెలంగాణ ముసాయిదా బిల్లును అడ్డుకుంటే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడులకు తెలంగాణ ఉసురు తగులుతుందని తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి శాపనార్థాలు పెట్టారు. బిల్లుపై అభిప్రాయమే తప్ప ఓటింగ్ ఉండదన్నారు.
శాసనమండలి వాయిదా పడిన అనంతరం నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కౌన్సిల్ వైపే చూడటం లేదని, ఇందుకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలన్నారు. పెద్దల సభను ప్రభుత్వం అగౌరవపరుస్తోందన్నారు.