రూట్ మారిన జగన్ పాదయాత్ర: కారణంపై భిన్నవాదనలు!
Recommended Video
తూర్పుగోదావరి:తూర్పగోదావరి లో ప్రజాసంకల్పయాత్ర కొనసాగిస్తున్న వైసిపి అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి పాదయాత్ర రూటు ఉన్నట్టుండి మారింది. ప్రస్తుతం పెద్దాపురంలో పర్యటిస్తున్న జగన్ షెడ్యూల్ ప్రకారం తరువాత పిఠాపురం వెళ్లాలి.
అయితే ఏమైందో తెలీదు కాని జగన్ తన పాదయాత్ర రూట్ ను మార్చుకున్నారు. పిఠాపురం నుంచి కత్తిపూడి వెళ్లాల్సిన జగన్ ఇప్పుడు తన షెడ్యూల్ లో లేని జగ్గంపేట కు వెళ్లనున్నారు. అంతేకాదు ఆ నియోజకవర్గంలో మూడు రోజులు ఉండేలా జగన్ పాదయాత్ర షెడ్యూల్ ను సవరించారు. అయితే ఇప్పుడు ఈ అంశమే రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకు జగన్ తన పాదయాత్ర రూట్ మార్చుకొని ఉంటారనే విషయంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
జగన్ పాదయాత్ర...ఇప్పుడు ఇలా...
వైసీపీ అధినేత జగన్ చేస్తున్న ప్రజాసంకల్పయాత్ర 28వ తేదీ శనివారం జగ్గంపేటకు చేరుకోనుంది. శనివారం రాత్రి జగ్గంపేటలోని జాతీయరహదారి పక్కనున్న బాలాజీనగర్లో నిర్వహించే భారీ బహిరంగసభలో జగన్ మాట్లాడతారు. జగన్ పాదయాత్ర ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా ముఖ్య నియోజకవర్గాల మీదుగా సాగుతూ వచ్చింది. తూర్పు గోదావరి జిల్లాలోకి చేరుకున్న తర్వాత జగన్ పాదయాత్ర షెడ్యూల్ ప్రకారం రాజమహేంద్రవరం, రావులపాలెం మీదుగా కోనసీమలోకి ప్రవేశించి కాకినాడ వరకు చేరుకుని అట్నుంచి ఇతర నియోజకవర్గాలకు సాగాల్సి ఉంది. ఆ క్రమంలో ఈ రూట్మ్యాప్ లో తొలుత జగ్గంపేట నియోజకవర్గానికి అవకాశం లేదు. దీనిపైనే జిల్లాలోకి వచ్చిన జగన్ను ఒకటికి రెండుసార్లు వైసీపీ జగ్గంపేట కోఆర్డినేటర్ జ్యోతుల చంటిబాబు మర్యాదపూర్వకంగా కలిసి విజ్ఞప్తి చేశారు.
ససేమిరా అన్న...జగన్
అయినప్పటికీ ఆ సందర్భంలో జగన్ మాట్లాడుతూ పాదయాత్ర జగ్గంపేట మీదుగా రావడానికి రూట్మ్యాప్ లేదని, పాదయాత్ర ముగిశాక బస్సుపై జగ్గంపేట నియోజకవర్గంలోకి తప్పకుండా వస్తానని స్పష్టం చేసినట్లు సమాచారం. కానీ ఏమైందోఏమో కానీ మరుసటి రోజునే జగన్ తన నిర్ణయం మార్చుకుని జగ్గంపేట మీదుగా పాదయాత్ర కొనసాగించడమే కాకుండా జగ్గంపేటలో భారీ బహిరంగసభ ఏర్పాటు చేయనున్నట్లు జ్యోతుల చంటిబాబుకు తెలిపారట. దీంతో జగన్ పాదయాత్ర కాకినాడ నుంచి అటే వెళ్లిపోతుందనుకున్న పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు జగన్ ఇక్కడకు వస్తున్నారని తెలియడంతో ఉత్సాహంగా ఏర్పాట్లు చేస్తున్నారట.
కాపుల...ఆశీస్సుల కోసమేనా?
జ్యోతుల నెహ్రూ ప్రాతినిధ్యం వహిస్తున్న జగ్గంపేట నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గీయుల సంఖ్య అధికం. పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత వ్యాఖ్యల కారణంగా కాపు సామాజిక వర్గం ఆగ్రహానికి గురైనట్లు కనిపించిన జగన్ అందుకు దిద్దుబాటు చర్యల్లో భాగంగా జగ్గంపేట నియోజకవర్గంలో పర్యటించాలని నిర్ణయించుకున్నారని వాదన వినిపిస్తోంది. కాపులు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతం గుండా పాదయాత్ర చేయడం ద్వారా కొంతయినా వారిని చల్లబరచడం చేయొచ్చని...ఈ తరుణంలో అసలు ఇటు రాకుండా పాదయాత్ర కాకినాడ వైపు వెళ్లిపోతే వీరిలో తన పట్ల ఆగ్రహం ఉంటే అది చల్లారే అవకాశం లేకుండా చేసుకున్నట్లు అవుతుందని జగన్ భావించి ఉండవచ్చని అంటున్నారు.
మరికొందరిద...వాదన...
జగన్ తాజా షెడ్యూల్ ప్రకారం శనివారం జగ్గంపేటలో జగన్ భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. 29న రాష్ట్ర స్థాయిలో నియోజకవర్గ కోఆర్డినేటర్లతో సమావేశం నిర్వహిస్తారు. తర్వాత రోజు కూడా ఇక్కడే పాదయాత్ర కొనసాగుతుంది. జగన్ పాదయాత్ర రూట్ మ్యాప్ లో అసలు స్థానమే లేని జగ్గంపేటలో ఉన్నట్టుండి స్థానం కల్పించడమే కాకుండా కీలక సభలు,సమావేశాలు ఇక్కడ ఏర్పాటు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే జ్యోతుల చంటిబాబు నియోజకవర్గంలో వైసీపీ తరుపున తన బలం చూపించుకోవడానికి, అలాగే నియోజకవర్గంలో బలమైన నేతగా వైసీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా పనిచేసి పార్టీని వీడిన జ్యోతుల నెహ్రూకు జగ్గంపేట నియోజకవర్గంలో వైసీపీకి ఎంత మద్దతు ఉందో ఈ బహిరంగసభ ద్వారా తెలియజెప్పడం కోసం ఈ మార్పు చేశారని అంటున్నారు.
కాపు రిజర్వేషన్పై...హామీ ఇస్తారేమో?
జగ్గంపేట నియోజకవర్గంలో కాపులు అధికశాతం ఉండడం...గతంలో కాపు రిజర్వేషన్ కోసం జగ్గంపేట నియోజకవర్గం నుంచి ఆందోళనలు వెల్లువెత్తిన సందర్భంగా జగన్ తాను ఇక్కడ ఏర్పాటు చేసే సభలో కాపులకు రిజర్వేషన్పై హామీ ఇచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే జగన్ ఇక్కడ కీలక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు విశ్లేషించుకుంటున్నారు. అందుకే జిల్లాలో మిగిలిన చోట్ల కన్నా అత్యధిక ఆదరణ జగన్ కు లభిస్తున్నట్లు ఇక్కడ ఏర్పాటు చేసే బహిరంగ సభ ద్వారా ప్రజలకు తెలియజెప్పేలా గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కోఆర్డినేటర్లు హాజరుకానున్న దృష్ట్యా వారి వెంట వచ్చే నాయకులతో సభ విజయవంతానికి సీనియర్ నాయకులు కృషి చేస్తున్నారు.
గతంలో జగ్గంపేటలో...ఇలా...
గత ఎన్నికల సందర్భంగా వైఎస్ఆర్ సిపిని ప్రకటించి పార్టీ గుర్తు విడుదల చేసే కార్యక్రమాన్ని జగ్గంపేట నియోజకవర్గంలోనే నిర్వహించారు. ఆ నేపథ్యం దృష్ట్యా తాజా భారీ బహిరంగసభ ద్వారా 2019 ఎన్నికల వ్యూహంపై నియోజకవర్గ కోఆర్డినేటర్లకు పూర్తిస్థాయిలో సూచనలు ఇచ్చే అవకాశం ఉంది. భారీఎత్తున జనం తరలించడానికి జాతీయ రహదారి పక్కన బాలాజీనగర్లో సభ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం సాయంత్రం నాటికి ఏర్పాట్లన్నీ పూర్తవుతాయి. ఇప్పటికే స్టేజీ నిర్మాణం, సెంట్రల్ ఏసీ పనులు, బారికేడ్లు, కుర్చీల హడావుడి మొదలుపెట్టారు. జగ్గంపేటలో ఇప్పటివరకు నిర్వహించని, కనీవినీ ఎరుగని సభ ఏర్పాట్లు జరుగుతున్నాయి.