టీటీడీలో భారీగా నల్లబంగారం
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తలనీలాలు సమర్పించే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ రికార్డు స్థాయికి చేరుకుంది. ఈ నల్ల బంగారాన్ని గత సంవత్సరాల కంటే ఈ ఏడాది మే నెలలో అత్యధికంగా సమర్పించడం విశేషం. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ పటిష్ట ఏర్పాట్లు చేపట్టి, నిరంతరాయంగా సేవలు అందిస్తోంది. కల్యాణకట్ట వద్ద రద్దీకి అనుగుణంగా సౌకర్యాలను కల్పిస్తోంది.
మొదటిసారిగా..
ఈ నెల 27వ తేది వరకు తిరుమలలో ఏకంగా 12,43,063 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇది.. పాత రికార్డులను తుడిచిపెట్టింది. 2024లో ఇదే నెలలో మొత్తం 10,65,729, కిందటేడాది 10,18,370 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఈ రెండింటినీ అధిగమించి ఈ సారి 12.50 లక్షల మంది తలనీలాలను సమర్పించారు. ఇటీవల వేసవి సెలవులు, వారాంతపు రద్దీ కారణంగా తిరుమలలో భక్తుల రాక భారీగా పెరిగింది.

కళ్యాణకట్టలు..
మే 18 నుండి 23 వరకు వరుసగా ఆరు రోజుల పాటు ప్రతిరోజూ 50 వేలకుపైగా భక్తులు తలనీలాలు సమర్పించారు. ముఖ్యంగా మే 23వ తేదీన ఒక్కరోజే 57,580 మంది భక్తులు తలనీలాలు సమర్పించడం భక్తులకు వేచిచూసే సమయం తగ్గించేందుకు, సౌకర్యవంతంగా తలనీలాలు సమర్పించేలా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ప్రధాన కళ్యాణకట్టతో పాటు పీఏసీ-1, పీఏసీ-2, పీఏసీ-3, పీఏసీ-5, జీఎన్సీ, హెచ్వీసీ, సప్తగిరి విశ్రాంతి గృహం, నందకం విశ్రాంతి గృహం, కౌస్తుభం విశ్రాంతి గృహం, శ్రీవేంకటేశ్వర విశ్రాంతి గృహం, శ్రీ పద్మావతి విశ్రాంతి గృహం ప్రాంతాల్లో మొత్తం 11 మినీ కళ్యాణకట్టలు భక్తులకు అందుబాటులో ఉన్నాయి.
నిరంతర సేవలు
టీటీడీలో మొత్తం 1,152 మంది క్షురకులు భక్తులకు సేవలు అందిస్తున్నారు. వీరిలో 269 మంది మహిళలు ఉన్నారు. ఒక్కొక్కరు 6 గంటల షిఫ్టులో సగటున 40 మందికి క్షర కర్మ చేస్తారు. మరోవైపు పెరిగిన రద్దీకి అనుగుణంగా 250 మంది సిబ్బందికి ప్రతిరోజూ అదనంగా విధులు కేటాయించడంతో ఒక్కొక్కరు అదనంగా దాదాపు 50 మంది భక్తులకు క్షర కర్మ చేస్తూ నిరంతరాయంగా సేవలు అందిస్తున్నారు.
పరిశుభ్రతకు ప్రాధాన్యత
భక్తులు అత్యంత పవిత్రంగా భావించే కళ్యాణకట్టల్లో టీటీడీ పరిశుభ్రతకు పెద్దపీట వేసింది. భక్తులకు కేటాయించే బ్లేడ్లను క్షురకులు ముందుగా సోడియం సొల్యూషన్ లో ముంచి ఆ తర్వాత డెటాయిల్ తో శుభ్రపరుస్తారు. తలనీలాలను ఎప్పటికప్పుడు సేకరించి భద్రపరుస్తారు. ప్రతి కళ్యాణకట్టలో భక్తులకు స్నానపు గదులతో పాటు వేడి నీరు అందుబాటులో ఉంచుతున్నారు టీటీడీ సిబ్బంది. తలనీలాల సమర్పణ అనంతరం భక్తులకు చందనం బిళ్లలను కూడా టీటీడీ అందిస్తున్నారు.












Click it and Unblock the Notifications