వరిసాగులో వినూత్న పద్దతి:తూర్పు గోదావరి జిల్లాలో అన్నదాతల మొగ్గు
తూర్పుగోదావరి:వరి సాగులోకి మరో కొత్త పద్దతి ప్రవేశించింది. వినూత్న విధానంలోని ఈ సాగుకి తూర్పు గోదావరి జిల్లాలో రైతన్నల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది.
బంగ్లా ఉడుపు ...ఈ పేరు ఎప్పుడైనా విన్నారా?...ఇంకా ఈ పదాన్ని అన్నదాతలందరూ వినుండకపోవచ్చు...కానీ కొన్న చోట్ల మాత్రం వరి సాగు చేసే రైతన్నలు నోట ఇదే మాట పదే పదే వినిపిస్తోంది. వరి సాగులో ప్రవేశించిన ఆ కొత్త పద్దతి పేరే...బంగ్లా ఉడుపు...అన్నదాతల పాలిట కల్పవృక్షంలా కనిపిస్తోన్న ఈ నయా సాగు పద్దతిపై తూర్పు గోదావరి జిల్లా రైతులు భారీ సంఖ్యలో మొగ్గు చూపుతున్నారు. ఇంతకీ ఈ పద్దతిలో రైతులను అంతగా ఆకట్టుకున్న విషయం ఏమిటంటే?...తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి ఇవ్వడం....
తూర్పు గోదావరి జిల్లాలో వరి సాగు చేసే రైతు బంగ్లా ఉడుపు ఫీవర్ ఆవరించింది. బంగ్లాదేశ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్ గఢ్ నుంచి వచ్చిన వలస కూలీలు అవలంభించే ఊడుపు పద్ధతినే బంగ్లా ఉడుపు అంటారు. ఈ పద్దతిలో ఒకటి లేదా రెండు వరి మొక్కలను దూరం దూరంగా నాటుతారు. ఇప్పుడు అదే పద్ధతిని తూర్పుగోదావరి జిల్లా రైతన్నలు అవలంబిస్తున్నారు. బంగ్లాదేశ్ లో భౌగోళిక పరిస్థితులకు అనుకూలంగా అవలంభిస్తున్న ఈ సాగు పద్ధతి అక్కడ ఉత్తమ ఫలితాలనిచ్చింది. దీంతో బంగ్లా వాతావరణ పరిస్థితులు భారత్ కు దగ్గరగా ఉంటాయంటూ ఇక్కడి అన్నదాతలూ అదే భరోసాతో నమ్మకంగా ఫాలో అయిపోతున్నారు.
మరోవైపు వ్యవసాయాధికారులు సైతం ఈ పద్దతి పట్ల సానుకూలంగా స్పందిస్తున్నారు. దీని ద్వారా తక్కువ పెట్టుబడితోనే ఎక్కవ లాభాలు అర్జించవచ్చని వ్యవసాయ అధికారులు అంటున్నారు. ఇందులో వలస కూలీలే నాట్లు వేయడం ఉపయుక్తమని అంటున్నారు. ఈ పద్దతిలో 15 మంది కూలీలు ఒక్కరోజులోనే సుమారు ఐదు నుంచి ఏడు ఎకరాల వరకు వరి నాట్లు వేస్తున్నారు. పైగా వీరే ఆకు తీతను కూడా తీసుకుంటున్నారు. వలస కూలీల స్పీడు, పనితనం చూసి ఇక్కడి రైతులు ఆశ్చర్యపోతున్నారు.
ఈ ఉడుపు పద్దతి రైతులకు చాలా ప్రయోజనకరంగా ఉందని...గత కొన్నేళ్లుగా తమ ప్రాంతంలో సాగు పనులకు కూలీలు దొరకడంలేదని, ఒకవేళ దొరికినా వారికి బాగా ఎక్కువ కూలీల ఇవ్వాల్సి వస్తోందని అంటున్నారు. అయితే వలస కూలీల చేత ఈ పనిచేయించడం వల్ల తక్కువ పెట్టుబడితోనే పనులు వేగంగా పూర్తయి లాభం ఎక్కువ పొందే అవకాశం ఉంటుందన్నారు. అందువల్ల ఒకరిద్వారా మరొకరు రైతులు ఈ పద్దతి గురించి తెలియగానే సాగుకు ముందుకు వస్తున్నారని చెప్పారు.