కేఏ పాల్ కు షాకిచ్చిన ఈసీ.. ప్రజాశాంతి పార్టీ రిజిస్ట్రేషన్ రద్దు; పాపం పాల్!!
కేఏ పాల్ కు ఎన్నికల కమిషన్ ఊహించని షాక్ ఇచ్చింది. కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ రిజిస్ట్రేషన్ రద్దు చేస్తూ ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఇక ఈ విషయం తెలిసిన వాళ్ళంతా పాపం పాల్ అంటూ ఆయనపైన ఆసక్తికర చర్చ చేస్తున్నారు.

కేఏ పాల్ కు ఝలక్ ఇచ్చిన ఈసీ
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా పరిచయం అవసరం లేని వ్యక్తి కేఏ పాల్. సొంత పార్టీ పెట్టి ఎన్నికల సమయంలో వచ్చి హడావుడి చేస్తారు. 2019లో ఏపీకే పరిమితమైన కేఏ పాల్ తనకు అవకాశం ఇవ్వాలని నానా హంగామా చేశారు. ఇక తాజాగా తెలంగాణ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇక తెలంగాణాలోనూ ప్రత్యామ్నాయం నేనే అని రచ్చ చేశారు. తెలంగాణా సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశారు. కేంద్రంలోనూ కీలకపాత్ర పోషించబోతున్నామని పాల్ తాజాగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో.. భారత ఎన్నికల సంఘం ఆయనకు ఝలక్ ఇచ్చింది. క్రియాశీలకంగా లేని పార్టీల జాబితాలో.. ప్రజాశాంతి పార్టీని చేర్చింది.

ఏపీ రాజకీయాల్లో నవ్వుల పువ్వులు పూయించిన కేఏ పాల్ పార్టీ
2008లో కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీని రిజిస్టర్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో 2009 ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని పాల్ ప్రకటించటంతో ఈసీ ఆ పార్టీకి హెలికాప్టర్ గుర్తును కేటాయించింది. 2019లో ప్రజాశాంతి పార్టీ నుంచి 11 మంది పోటీ చేశారు. కానీ ఎవరూ గెలవలేదు. ఇక గెలుపు విషయానికి వస్తే... పాల్ పార్టీకి కనీసం ఒకటి, రెండు స్థానాల్లో కూడా అభ్యర్థులు లేరు. అప్పుడు కెఏ పాల్ పార్టీకి కేవలం నాలుగు వేల పైచిలుకు ఓట్లు మాత్రమే వచ్చాయి. అయినప్పటికీ ఆయన చేసిన హంగామా ఏపీ రాజకీయాల్లో నవ్వులు పూయించింది.

రాజకీయ పార్టీల విషయంలో సంస్కరణలు చేపట్టిన ఈసీ.. కేఏ పాల్ పార్టీ గుర్తింపు రద్దు
ఇదిలా ఉంటే ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీల విషయంలో కొన్ని సంస్కరణలను చేపట్టింది. వాటికి కొనసాగింపుగా కీలక నిర్ణయాలు తీసుకున్న ఎన్నికల సంఘం ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కు షాక్ ఇచ్చింది. రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యకలాపాలు సాగించని నిష్క్రియ పార్టీల జాబితా లో కెఏ పాల్ పార్టీని చేర్చింది. ఇక కేఏ పాల్ పార్టీ గుర్తును సైతం రద్దు చేసి షాక్ ఇచ్చింది.

రాజకీయాల్లో కేఏ పాల్ పై పెరిగిన క్రేజ్ .. ఈసీనిర్ణయంపై కేఏ పాల్ స్పందన ఏమిటో?
శాంతి దూతగా కేఏ పాల్ కు ఉన్న గుర్తింపు కంటే, రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి పాల్ కు ఓ రేంజిలో క్రేజ్ పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో పాల్ గురించి తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. సోషల్ మీడియాలో కేఏ పాల్ ఏం మాట్లాడినా ఆసక్తికరమే. అలాంటి వ్యక్తి పార్టీకి ఈసీ ఝలక్ ఇవ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇక ఈ సమయంలో ఈసీ షాక్ ఇవ్వడంతో కేఏ పాల్ ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications