గ్యాంగ్రేప్ నిందితుడూ రానంటాడు: జగన్ ఆస్తుల కేసులో లాయర్
హైదరాబాద్: నోటీసులు ఇచ్చినప్పుడు విచారణకు రానంటే ఏ కేసూ ముందుకు సాగదని, సామూహిక అత్యాచారం కేసులో నిందితుడు కూడా విచారణకు రాననే అంటాడని అదనపు సొలిసిటర్ జనరల్ మంగళవారం హైకోర్టులో అన్నారు.
వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు విషయమై దాల్మియా వేసిన పిటిషన్ పైన విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఈడీ తరఫు న్యాయవాది మాట్లాడారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఆధారాలన్నీ సేకరించాక అనుమానం ఉన్న వ్యక్తిని విచారించే అధికారం ఈడీకి ఉందన్నారు.
మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రత్యేకమని, చట్టప్రక్రియలో భాగంగానే దాల్మియా సిమెంట్స్ ఎండీ పునీత్ దాల్మియాకు నోటీసులు జారీ చేశామన్నారు. నోటీసులు ఇచ్చినపుడు విచారణకు రానంటే ఏ కేసూ ముందుకు సాగదని, సామూహిక అత్యాచారం కేసులో నిందితుడు కూడా విచారణకు రాననే అంటాడన్నారు.
జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో భాగంగా దాల్మియా సిమెంట్స్కు కడప జిల్లాలో సున్నపురాయి లీజులకు ప్రతిగా భారతి సిమెంట్స్లో రూ.95 కోట్లు పెట్టుబడులు పెట్టడం, అనంతరం వాటాల విక్రయంతో వచ్చిన సొమ్మును అనధికారికంగా అందజేయాలన్న ఒప్పందం కుదిరిందన్నది సీబీఐ ఆరోపణ.
ఈ లావాదేవీలపై విచారణ నిమిత్తం హాజరుకావాలంటూ ఈడీ ఇచ్చిన సమన్లను రద్దు చేయాలని దాల్మియా సిమెంట్స్ ఎండీ పునీత్ దాల్మియా హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై గత వారం దాల్మియా తరఫున కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ న్యాయవాది చిదంబరం వాదనలు వినిపించారు. ఇప్పుడు ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ రాజగోపాలన్ వాదనలు వినిపించారు.