ED Raids: ఏపీలో ఈడీ సోదాల కలకలం - టార్గెట్ ఎవరు..!!
ED Raids in AP: ఇప్పటి వరకు తెలంగాణలో జరుగుతున్న ఈడీ రైడ్స్ ఇప్పుడు ఏపీలో మొదలయ్యాయి. ఢిల్లీ నుంచి వచ్చిన నాలుగు టీంలు నిర్దేశిత ప్రాంతాలు..సంస్థలు..వ్యక్తుల నివాసాల్లో సోదాలు కొనసాగిస్తున్నారు. ఎటువంటి సమాచారం బయటకు రానీయటం లేదు. ప్రధానంగా ఒక ప్రముఖ ఆస్పత్రి..అందులో గతంలో కీలకంగా పని చేసిన వారే లక్ష్యంగా ఈ సోదాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఏపీలో ప్రస్తుతం కొనసాగుతున్న సోదాలతో ఒక్క సారిగా కలకలం మొదలైంది.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఏపీ కేంద్రంగా సోదాలు నిర్వహిస్తున్నారు. మంగళగిరిలోని ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయని సమాచారం. ఆస్పత్రిలో రికార్డులను అధికారులు పరిశీలస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక అధికారులు రెండు బృందాలుగా విడిపోయి రికార్డులు తనిఖీ చేస్తున్నారు. అలాగే ఎన్ఆర్ఐ ఆస్పత్రి కమిటీ సభ్యుల ఇళ్లలో కూడా ఈడీ సోదాలు నిర్వహిస్తోందని సమాచారం. అయితే ఎన్ఆర్ఐ కమిటీ సభ్యురాలు అక్కినేని మణి ఎన్ఆర్ఐ నిధులతో సొంత ఆస్పత్రికి వైద్య పరికరాలు కొన్నారనే ఆరోపణలపై ఈ సోదాలు జరుగుతన్నాయనే ప్రచారం సాగుతోంది. అలాగే ఎన్ఆర్ఐ కమిటీ మరో సభ్యుడు నిమ్మగడ్డ ఉపేంద్ర ఇంటిపైనా కూడా దాడులు నిర్వహిస్తోంది.

ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో డైరెక్టర్ గా వ్యవహరించిన మణి అక్కినేని ఉమెన్స్ హాస్పిటల్ నిర్వహిస్తున్నారు. ఆ ఆస్పత్రి పైనా రైడ్స్ కొనసాగుతున్నాయి. ఆసుపత్రి లోపలికి ఎవరు వెళ్లకుండా సెక్యూరిటీగా సీఆర్పీఎఫ్ సిబ్బంది పహారా కాస్తున్నారు. ఆస్పత్రి సిబ్బంది ఫోన్లను కూడా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఆసుపత్రి ఛైర్మన్ తో సహా సిబ్బందిని 8మంది ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అమెరికాలో వైద్యురాలిగా ఉంటూ ఈ ఏడాది ఆగస్టులోనే విజయవాడలో అక్కనేని మణి అక్కినేని ఉమెన్స్ ఆసుపత్రిని ప్రారంభించారు. అక్కినేని మణిని విచారణ అధికారులు ఒక కారులో తీసుకెళ్లారని తెలుస్తోంది. విదేశీ నిధులు అక్రమంగా దారిమళ్లింపు చేశారనే ఆరోపణల నేపధ్యంలో ఈడీ తనిఖీలు కొనసాగుతున్నాయని చెబుతున్నారు. సోదాల తరువాత అధికారులు వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.