ఈదర హరిబాబుకు సుప్రీంలో ఊరట: ఏకసభ్య ధర్మాసనం తీర్పునకు సమర్థన
ఢిల్లీ: ప్రకాశం జిల్లాపరిషత్ ఛైర్మన్ ఎన్నిక వివాదంలో ఈదర హరిబాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసును మంగళవారం జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ అభయ్ మనోహర్ సప్రేలతో కూడిన ధర్మాసనం విచారించింది.
హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం తీర్పును తోసి పుచ్చిన సర్వోన్నత ధర్మాసనం, హైకోర్టు ఏక సభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును సమర్థించింది. హరిబాబు ఛైర్మన్ పదవికి అనర్హుడిగా జిల్లా కలెక్టర్ గతంలో ఆదేశాలు ఇచ్చారు.
దీనిపై సవాల్ చేస్తూ హరిబాబు స్థానిక కోర్టుని ఆశ్రయించగా కలెక్టరు నిర్ణయాన్ని కోర్టు సమర్థించింది. ఈ తీర్పుని సవాల్ చేస్తూ హరిబాబు హైకోర్టుకు వెళ్లారు. హరిబాబును అనర్హుడిగా ప్రకటించడాన్ని ఏకసభ్య ధర్మాసనం తప్పుపట్టింది.

దీన్ని సవాల్ చేస్తూ తెలుదేశం పార్టీ విప్ నరసింహం, జిల్లా కలెక్టర్ ద్విసభ్య ధర్మాసనాన్నిఆశ్రయించారు. ద్విసభ్య ధర్మాసనం కలెక్టరు ఉత్తర్వులను సమర్థిస్తూ తుది తీర్పువచ్చే వరకు జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడికి ఛైర్మన్ బాధ్యతలు అప్పగించాలని ఆదేశించింది. దీనిపై హరిబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈ నేపథ్యంలో హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం తీర్పును తోసి పుచ్చిన సర్వోన్నత ధర్మాసనం, హైకోర్టు ఏక సభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును సమర్థించింది.












Click it and Unblock the Notifications