'జగన్పై ఈనాడు, ఆంధ్రజ్యోతి గేమ్': ఎస్పీవైపై ఫిర్యాదు
హైదరాబాద్: ఈనాడు, ఆంధ్రజ్యోతిలు మైండ్ గేమ్ ఆడుతున్నాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం గురువారం ఆరోపించారు. తప్పుడు కథనాలతో దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. రాజకీయ నేతల వ్యక్తిగత విలువలు మంటగలిసేలా ప్రవర్తిస్తున్నాయని ధ్వజమెత్తారు.
తాను తన చివరి శ్వాస వరకు వైయస్ జగన్ వెంటే ఉంటానన్నారు. బలమైన ప్రతిపక్షంగా ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీని దెబ్బతీసేందుకు ఈ రెండు మీడియా సంస్థలు ప్రయత్నిస్తున్నాయన్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతిలు ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని లేకపోతే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. మీడియాకు ఎంత స్వేచ్ఛ ఉందో అంత పరిమితి కూడా ఉందన్నారు.
ఎస్పీవై రెడ్డిపై ఫిర్యాదు
నంద్యాల ఎంపీ ఎస్పీపై రెడ్డిపై అనర్హత వేటు వేయాలంటూ లోకసభ స్పీకర్ సుమిత్రా మహాజన్కు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎంపీలు గురువారం ఫిర్యాదు చేశారు. ఇటీవల లోకసభ ఎన్నికల్లో జగన్ పార్టీ తరపున పోటీ చేసి గెలిచిన ఎస్పీవై కొన్ని రోజులకే టిడిపిలో చేరిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి, పార్టీ ఎంపీలు సభాపతిని కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం మేకపాటి మాట్లాడుతూ... ఎస్పీవై రెడ్డి తనకు తానుగానే టిడిపిలో చేరినట్లు ప్రకటించుకున్నారని, అనర్హత వేటు వేస్తే టిడిపి తరఫున పోటీ చేస్తానని ఆయనే చెప్పారని, నిబంధనల ప్రకారం ఆయన పైన అనర్హత వేటు వేయాలని సభాపతిని కోరినట్లు చెప్పారు.