కెవిపి, లగడపాటి సహా 8 మంది ఎంపీలు రిజైన్?
రాష్ట్ర విభజనపై కాంగ్రెసు అధిష్టానం వెనక్కి తగ్గడానికి ఏ మాత్రం సుముఖంగా లేకపోగా, రాజీనామాలు చేస్తే చేయండనే బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తోంది. దీంతో 8 మంది పార్లమెంటు సభ్యులు మంగళవారం ఈ నెల 24వ తేదీన రాజీనామాలను ఆమోదింపజేసుకోవడానికే మొగ్గు చూపుతున్నారు. వారిని శాంతింపజేసేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సహా జెసి దివాకర్ రెడ్డి వంటి సీమాంధ్రకు చెందిన పలువురు నేతలు తుది విడత ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా, వారు వెనక్కు తగ్గడం లేదని తెలుస్తోంది.
రాష్ట్ర విభజన జరిగితే తమ రాజకీయ జీవితం ముగుస్తుందనే ఆందోళన వారిలో ఉన్నట్లు చెబుతున్నారు. అలాంటప్పుడు అధిష్టానాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని వారు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. పార్లమెంటు సభ్యత్వాలకు, పార్టీకి రాజీనామాలు చేసి, సొంత పార్టీ పెట్టుకునే దిశగా కూడా వారి ఆలోచనలు సాగుతున్నట్లు వార్తలు వచ్చాయి. పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఆదివారం చేసిన వ్యాఖ్యలు అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
ఢిల్లీతో ఇక మాటల్లేవని, అధిష్ఠానాన్ని కాళ్లా వేళ్లా పడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.. మంగళవారమే తనతో పాటు ఆరేడుగురు రాజీనామాలను ఆమోదింపజేసుకుంటారని కూడా ఆయన తేల్చి చెప్పారు. రాజీనామాను ఆమోదింపజేసుకునే విషయంలో హర్షకుమార్ వంటి ఒకరిద్దరు వెనక్కి తగ్గుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కేంద్ర మంత్రి వర్గానికి రాష్ట్ర విభజన నోట్ వచ్చినప్పుడు దానిపై 'డిసెంట్ నోట్' రాయాలని సీమాంధ్ర కేంద్ర మంత్రులు భావిస్తున్నారు. ఆ తర్వాత పదవులకు రాజీనామా చేయాలని భావిస్తున్నారు. డిసెంట్ నోట్ రాసినా ఆగకపోతే అసెంబ్లీలో తీర్మానాన్ని ఓడించాలని అనుకుంటున్నారు. ఆ తర్వాత సీమాంధ్ర నేతలు రాజీనామాలకు పెద్ద యెత్తున సిద్ధపడే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.
రాజీనామాలతో ఒత్తిడి పెంచుతూనే మరోవైపు ముఖ్యమంత్రి ద్వారానే ఢిల్లీపై ఒత్తిడి తేవాలని, అప్పటికీ కాకపోతే పార్టీపై తిరుగుబాటు అనివార్యమని సీమాంధ్ర ప్రాంత నేతలు స్పష్టం చేస్తున్నారు. సోమవారం (23న) జాతీయ సమైక్యతా మండలి సమావేశాలకు వెళుతున్న సీఎం మరోసారి పార్టీ ముందు తన సమైక్య వాణిని వినిపించబోతున్నట్లు సమాచారం.