'కాపు' కాస్తున్న చిరు, జగన్, బాబు: లెక్క కుదిరేనా?
హైదరాబాద్: రానున్న సార్వత్రిక ఎన్నికలలో ఇరవై శాతం వరకు ఉన్న కాపులు సీమాంధ్ర ప్రాంతంలో కీలకంగా మారనున్నారా? అంటే అవుననే అంటున్నారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎక్కువ స్థానాలను కైవసం చేసుకున్న పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని, అదే సమయంలో కాపులు మద్దతిచ్చిన పార్టీ కోస్టల్ జిల్లాలో ఎక్కువ సీట్లను గెలుచుకుంటుందనే వాదన ఉంది.
అయితే, 2009 ఎన్నికల ఫలితాలు ఆ వాదనకు అటు ఇటుగా ఉన్నాయనే చెప్పవచ్చు. కాపులు ఎక్కువగా పిఆర్పీకి ఓటేస్తే.. కాంగ్రెసు పార్టీ ఎక్కువ స్థానాలలో గెలిచింది. కాగా, మొదట తెలుగుదేశం పార్టీకి దగ్గరగా ఉన్న కాపు సామాజికవర్గం.. వంగవీటి రంగ ఘటన తర్వాత దూరమయ్యారని అంటారు.
సీమాంధ్ర ప్రాంతంలో ఆరు శాతం మంది కమ్మ సామాజికవర్గం, పన్నెండు శాతం రెడ్డి సామాజిక వర్గం ఉంది. కాపుల శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఆ సామాజిక వర్గం నుండి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన వారు లేరు. ఈ నేపథ్యంలోనే 2009లో పుట్టుకు వచ్చిన చిరంజీవి ప్రజారాజ్యం పార్టీకి కాపులు పట్టం గట్టారు. చిరంజీవి అదే సామాజిక వర్గానికి చెందినవారు.
ఓ సర్వే ప్రకారం... 2009 ఎన్నికల్లో చిరంజీవి ప్రజారాజ్యం 59 శాతం కాపు ఓట్లను తన ఖాతాలో వేసుకుంది. కాంగ్రెసు పార్టీకి 25 శాతం మంది, టిడిపికి 12 శాతం మంది మద్దతు పలికారట. అంత పెద్ద మొత్తంలో కాపు ఓట్లను పిఆర్పీ కొల్లగొట్టినప్పటికీ... కాంగ్రెసు పార్టీ కాపు అభ్యర్థులే ఎక్కువ స్థానాల్లో గెలుపొందారు.
2009 ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ 14 మంది కాపులకు, టిడిపి 8 మందికి, ప్రజారాజ్యం 37 మందికి టిక్కెట్లు ఇచ్చింది. ఆ ఎన్నికల్లో తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల నుండి 33 మంది కాపు సామాజిక వర్గం నేతలు గెలుపొందారు.
ఈసారి చిరంజీవి కాంగ్రెసు పార్టీతో కలిసిపోవడం, కాపులు టిడిపి వైపు మొగ్గు చూపుతుండటం, పవన్ కళ్యాణ్ రాక... ఈ పరిణామాలన్నింటితో 2014 ఎన్నికల్లో ఆ సామాజిక వర్గం ఎవరి వైపు నిలుస్తుంది, గోదావరి జిల్లాలో ఎక్కువ సీట్లు గెలిచిన పార్టీ మళ్లీ నిలబడుతుందా లేక ఎక్కువ ఓట్లు దక్కించుకున్న పార్టీ గెలుస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది. 2009లో పిఆర్పీ ఎక్కువ కాపు ఓట్లను తన ఖాతాలో వేసుకున్నప్పటీకి విజయం మాత్రం వరించలేదు. ఈ ఎన్నికల్లో కాపులను మచ్చిక చేసుకునేందుకు అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.