ఏపీ - తెలంగాణలో మరో ఎన్నికల సమరం : ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ జారీ...!!
ఏపీ..తెలంగాణలో ఎమ్మెల్యే ఎన్నికల కోసం ఉప ఎన్నికలు ముగిసిన వెంటనే కేంద్ర ఎన్నికల సంఘం ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏపీలో మూడు..తెలంగాణలో ఆరు ఎమ్మెల్యే కోటాలో భర్తీ చేయాల్సి ఉన్న ఆరు ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. ఏపీలో ఎమ్మెల్సీలుగా పని చేసిన మాజీ ఛైర్మన్ ఎంఏ షరీఫ్...బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. డీసీ గోవింద రెడ్డి ఈ ఏడాది మే 31న పదవీ విరమణ చేసారు. అదే విధంగా తెలంగాణ నుంచి ఆకుల లలిత...ఫరీదుద్దీన్...గుత్తా సుఖేందర్ రెడ్డి..నేతి విద్యాసాగర్..బీ వేంకటేశ్వర్లు..కడియం శ్రీహరి జూన్ 3వ తేదీన పదవీ విరమణ చేసారు.
ఏపీలో మూడు..తెలంగాణలో ఆరు స్థానాలకు
దీంతో రెండు రాష్ట్రాలోని మొత్తం 9 స్థానాలకు షెడ్యూల్ ఖరారైంది. ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఈ నెల 6వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 16వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 17న నామినేషన్ల స్క్రూటినీ నిర్వహిస్తారు. 22వ తేదీ నామినేషన్ల ఉప సంహరణకు చివరి తేదీగా ఖరారు చేసారు. నవంబర్ 29న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ నిర్వహిస్తారు. డిసెంబర్ 1వ తేదీ లోగా మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.
వైసీపీ ఖాతాలోనే ఈ మూడు స్థానాలు
ఇక, ఏపీలో అధికార పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య మెజార్టీ గా ఉండటంతో ఈ మూడు స్థానాలు అధికార వైసీపీకే దక్కే అవకాశం కనిపిస్తోంది. తాజాగా వైసీపీ నేతలు ఎన్నికల సంఘాన్ని కలిసిన సందర్భంలో పెండింగ్ లో ఉన్న ఈ ఎన్నికలను వెంటనే పూర్తి చేయాలని కోరారు. అదే విధంగా తెలంగాణలోని ఆరు స్థానాల్లో నాలుగు స్థానాలు అయిదు స్థానాలు టీఆర్ఎస్ కు ఖాయంగా దక్కే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. మరో స్థానం కోసం ప్రతిపక్ష కాంగ్రెస్ పోటీ పడే అవకాశం ఉంది. ఇక, ఇప్పటికే ఏపీలో వైసీపీ ఎమ్మెల్సీల సంఖ్య బలం పెరుగుతోంది.
ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడికాగానే
ఇదే సమయంలో ఈ మూడింటితో పాటుగా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీల భర్తీ సైతం పెండింగ్ లో ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి కావటంతో..ఇప్పుడు ఆ కోటాలో భర్తీ చేయాల్సిన 11 స్థానాలకు త్వరలో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని వైసీపీ నేతలు చెబుతున్నారు. అన్ని జిల్లాల్లోనూ వైసీపీ మెజార్టీ స్థానాలు గెలవటంతో.. అవి కూడా వైసీపీ ఖాతాలోనే జమ అయ్యే అవకాశం ఉంది. ఈ నెల 2వ తేదీన ఏపీలో బద్వేలు..తెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇక, ఇప్పుడు ఎమ్మెల్సీ పదవుల ఆశావాహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేయనున్నారు.