eluru fire accident: పోరస్ ఫ్యాక్టరీవద్ద స్థానికుల ఆందోళన; తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించిన కలెక్టర్
ఏలూరు జిల్లాలోని అక్కిరెడ్డిగూడెం రసాయన పరిశ్రమలో ఘోర అగ్ని ప్రమాదంలో ఆరుగురు మరణించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఐదుగురు ఘటనా స్థలంలోనే సజీవదహనం కాగా, మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. మరో 13 మందికి తీవ్రగాయాలు కాగా పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
Recommended Video
పోరస్ ఫ్యాక్టరీ ముందు స్థానికుల ఆందోళన.. ఫ్యాక్టరీ తరలింపు డిమాండ్
పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో గాయపడి పరిస్థితి విషమంగా మారిన వారిని విజయవాడ జిజిహెచ్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు పరిశ్రమల ఎదుట స్థానికులు ఆందోళన చేపట్టారు. ఈ పరిశ్రమ వల్ల గ్రామంలో గాలి, నీరు కలుషితమవుతోంది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక పరిశ్రమల నుండి వచ్చే వ్యర్థాల ద్వారా కలుగుతున్న దుర్వాసనతో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నామని తక్షణం ఈ పరిశ్రమను ఇక్కడి నుండి తరలించాలని వారు డిమాండ్ చేశారు.
రోడ్డుకు అడ్డంగా ముళ్లకంచెలు వేసి రాకపోకలను అడ్డుకున్న స్థానికులు
పోరస్ కెమికల్ ఫ్యాక్టరీ వల్ల తమ పంటలు సరిగా పండక లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈ పరిశ్రమపై గతంలో అనేక మార్లు ఫిర్యాదు చేశామని అయినా అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవని వారు తెలిపారు. ఇక రోడ్డుకు అడ్డంగా ముళ్లకంచెలు వేసి రాకపోకలను అడ్డుకున్నారు. స్థానికులు ప్రమాద బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పరిశ్రమలోకి చొచ్చుకు వెళ్లేందుకు అక్కడి గ్రామస్తులు ప్రయత్నించగా పోలీసులు ఎక్కడికక్కడ వారిని అడ్డుకున్నారు.
పోరస్ కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాద స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ , ఏలూరు ఎంపీ
ఏలూరు పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాద స్థలాన్ని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని, కార్మికులను అడిగి తెలుసుకున్నారు. ఫ్యాక్టరీలో ఎటువంటి ముడి పదార్ధాలు తయారవుతున్న దానిపై ఆరా తీసిన అధికారులు అందుకు సంబంధించిన అన్ని వివరాలను సేకరించారు. ఫ్యాక్టరీలో పాలిమర్ ప్లాస్టిక్ ఉపయోగించే ముడి పదార్థమే కాకుండా ఇతర ముడి పదార్ధాలు ఉన్నట్టు కార్మికులు చెప్తున్నారు.
పోరస్ కంపెనీని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించిన కలెక్టర్
ఇక ఈ ఘటనపై స్పందించిన జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అగ్ని ప్రమాదం సంభవించిన పోరస్ కంపెనీని పరిశీలించి ప్రస్తుతానికి పోరస్ కంపెనీని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. హై ప్రెషర్ వల్ల కెమికల్ రియాక్షన్ జరిగి ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఆయన వెల్లడించారు. కంపెనీ నిబంధనలు ఏమైనా ఉల్లంఘించినదా? ప్రమాదకర రసాయనాలు వినియోగం ఏమైనా జరిగిందా? అనే అంశాలపై విచారణ చేపడతామని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. క్షతగాత్రులకు చికిత్స పొందుతూ ఉన్నంతకాలం పోరస్ కంపెనీ వారికి వేతనం అందిస్తుందని ఏలూరు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పేర్కొన్నారు.