వివాదాల 'శాంతి'కి జైలు శిక్ష.. అవినీతి సామ్రాజ్యంపై ఏసీబీ పంజా!
దేవాదాయ శాఖలో అత్యంత వివాదాస్పద అధికారిణిగా పేరుపొందిన అసిస్టెంట్ కమిషనర్ (ఏసీ) కె.శాంతి అవినీతి సామ్రాజ్యం కుప్పకూలింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులకు చిక్కిన ఆమెకు, కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో విజయవాడ సబ్ జైలుకు తరలించారు. నాలుగేళ్ల స్వల్ప సర్వీసులోనే రాజకీయ అండదండలతో ఆమె సాగించిన అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.
దేవాదాయ శాఖలో నిబంధనల ఉల్లంఘనకు కేరాఫ్ అడ్రస్గా నిలిచిన అసిస్టెంట్ కమిషనర్ కె.శాంతి ఎట్టకేలకు కటకటాల పాలయ్యారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న అభియోగాలపై ఏసీబీ సోదాలు నిర్వహించి, ఆమెను అరెస్ట్ చేసింది. అనంతరం జడ్జి ముందు హాజరుపరచగా, ఈ నెల 21 వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పోలీసులు ఆమెను విజయవాడ సబ్ జైలుకు తరలించారు.

తనిఖీల్లో బయటపడ్డ ఆస్తులు..
- శాంతి వద్ద ఉన్న బంగారు ఆభరణాలు: 76 గ్రాములు
- ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు: 700.19 గ్రాములు
- వెండి వస్తువులు: 2,963 గ్రాములు
- డబ్బు: రూ.1.13 లక్షలు
- గృహోపకరణాల విలువ: రూ. 6.52 లక్షలు
- విశాఖపట్నం శివారు ఎండాడలో ఓ ఫ్లాట్
- తాడేపల్లిలోని కుంచనపల్లిలో విల్లా
- బ్యాంకు ఖాతాలో నిల్వ: రూ. 2.84 లక్షలు
- వాహనాలు: ఫోక్స్వ్యాగన్ పోలో కారు, వెస్పా మోటార్ సైకిల్
- ఎలక్ట్రానిక్ పరికరాలు: మూడు మొబైళ్లు, ఒక యాపిల్ మ్యాక్బుక్ ఎయిర్
రాజకీయ అండతో అక్రమాల పర్వం..
2020లో బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే శాంతిపై లెక్కలేనన్ని ఆరోపణలు ఉన్నాయి. అప్పటి అధికార వైసీపీకు చెందిన ఒక కీలక ఎంపీ అండతో ఆమె నిబంధనలను తుంగలో తొక్కినట్లు తెలుస్తోంది. విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లోని విలువైన ఆలయ భూములను వేలం లేకుండానే తమ అనుయాయులకు 11 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చి ప్రభుత్వానికి కోట్ల రూపాయల నష్టం చేకూర్చారు. ముఖ్యంగా అనకాపల్లి జిల్లా లంకెలపాలెంలోని పరదేశమ్మ ఆలయ భూములను ఒక ఐస్క్రీం యూనిట్కు కట్టబెట్టడం అప్పట్లో పెను సంచలనం సృష్టించింది.
అధికారులపైనే దాడులు.. విలాసవంతమైన జీవితం..
శాంతి ప్రవర్తన కేవలం అవినీతికే పరిమితం కాలేదు. గతంలో విశాఖ ఏసీగా ఉన్నప్పుడు తోటి ఉపకమిషనర్పై కార్యాలయంలోనే ఇసుక చల్లి అవమానించిన ఘటన ఆమె దూకుడుకు నిదర్శనం. ఆ సమయంలో రాజకీయ ఒత్తిడితో బాధితుడే సెలవుపై వెళ్లాల్సి వచ్చింది. ఇక వ్యక్తిగత జీవితంలోనూ వివాదాలకు కొదవలేదు. మొదటి భర్తకు విడాకులు ఇవ్వకుండానే రెండో వివాహం చేసుకోవడం, తాడేపల్లిలో మంత్రుల నివాసాల మధ్య ఖరీదైన విల్లా కొనుగోలు చేయడం వంటి అంశాలు ఆమె అక్రమార్జనకు అద్దం పడుతున్నాయి.
హైకోర్టు ఆదేశాలు.. మరుసటి రోజే ఏసీబీ చెక్..
అనేక ఉల్లంఘనల నేపథ్యంలో 2024 జూలైలో ప్రభుత్వం ఆమెను సస్పెండ్ చేసింది. అయితే, ఏడాదిలోపు విచారణ పూర్తి చేసి చర్యలు తీసుకోలేదన్న సాంకేతిక కారణంతో హైకోర్టును ఆశ్రయించి, ఇటీవలే సస్పెన్షన్ ఎత్తివేయించుకున్నారు. గత నెల 24న డ్యూటీలో జాయిన్ అయిన మరుసటి రోజే ఏసీబీ రంగంలోకి దిగింది. ఆమె నివాసాలు, కార్యాలయాల్లో జరిపిన సోదాల్లో భారీగా అక్రమాస్తులు బయటపడటంతో ఆమె ఆట కట్టినట్లయింది.
ప్రస్తుతం జైలుపాలైన శాంతిపై దేవాదాయ శాఖ తదుపరి కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. రాజకీయ పలుకుబడితో వ్యవస్థలను మేనేజ్ చేయాలనుకున్న ఒక అధికారిణి ప్రస్థానం ఇలా జైలు గోడల మధ్యకు చేరడం చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications