సుప్రీంలో కీలక మలుపు తిరిగిన వివేకా హత్య కేసు
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్పై సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఈ పిటిషన్పై విచారణను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేశారు. జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం ఈమేరకు నిర్ణయం తీసుకుంది. గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్పై తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకుంటుందని, వివేకా హత్య కేసు విచారణను ఇప్పటికే సుప్రీంకోర్టు తెలంగాణకు బదిలీ చేసిందని ధర్మాసనం తెలిపింది. గంగిరెడ్డి బెయిల్ రద్దుపై కూడా తెలంగాణ హైకోర్టే నిర్ణయిస్తుందని, గతంలో బెయిల్ మంజూరు చేసినప్పుడు మెరిట్ను పరిగణనలోకి తీసుకోలేదని, ఇప్పుడు తెలంగాణ హైకోర్టు అన్ని అంశాలను పరిశీలించి బెయిల్ రద్దుపై నిర్ణయం తీసుకుంటుందని జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం వెల్లడించింది.
వివేకా హత్య కేసు దర్యాప్తులో భాగంగా ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దుచేయాలని సీబీఐ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఏపీ పోలీసులు వివేకా కేసును దర్యాప్తు చేస్తున్నప్పుడు సరైన సమయంలో ఛార్జిషీటు దాఖలు చేయకపోవడంతో గంగిరెడ్డికి బెయిల్ వచ్చింది. తర్వాత విచారణ సీబీఐ చేతికి వచ్చింది. సీబీఐ దర్యాప్తులో అనేక కీలక అంశాలు వెలుగుచూశాయి. వాటి ఆధారంగా గంగిరెడ్డికి బెయిల్ రద్దుచేయాలని సీబీఐ విజ్ఞప్తిని హైకోర్టు తిరస్కరించింది. విచారణకు గంగిరెడ్డి పూర్తిగా సహకరిస్తున్నారని, అందువల్ల బెయిల్ రద్దుచేయాల్సిన అవసరం లేదని గంగిరెడ్డి తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం తీర్పును వాయిదా వేయడంతోపాటు పిటిషన్ పై విచారణను కూడా తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసింది.
వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులకు గతంలోనే బెదిరింపులను ఎదుర్కొన్నారు. కడప సెంట్రల్ జైలు నుంచి పట్టణంలోకి ప్రవేశించే క్రమంలో దారిలో సీబీఐ అధికారుల వాహనాన్ని అటకాయించి బెదిరింపులకు గురిచేశారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన సీబీఐ తన కారు డ్రైవర్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయించింది. అలాగే దర్యాప్తునకు నేతృత్వం వహిస్తున్న రాంసింగ్ అనే అధికారిపై కేసు నమోదు చేయగా హైకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకోవాల్సి వచ్చింది.