జగన్ ఏపి సిఎం అయితే కెసిఆర్కు బాగుండేది: ఎర్రబెల్లి
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్రస్థాయి ధ్వజమెత్తారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కెసిఆర్ రాజకీయ జీవితం మోసాలతో ప్రారంభమైందని అన్నారు. అసమర్థ పాలనను కప్పిపుచ్చుకునేందుకే ఏపి సిఎం చంద్రబాబు నాయుడును తిట్టినతిట్టు తిట్టకుండా తిడుతున్నారని కెసిఆర్పై మండిపడ్డారు.
ఎవరు అబద్ధాల కోరో తెలంగాణ ప్రజలకు తెలుసని ఎర్రబెల్లి అన్నారు. సెంటిమెంటు మీదే కెసిఆర్ గెలిచారని అన్నారు. తెలుగుదేశం పార్టీ కెసిఆర్కు ప్రాధాన్యత ఇచ్చి, మంత్రిని చేసిందని గుర్తు చేశారు. కెసిఆర్ కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్ర సమస్యలను పట్టించుకోలేదని ఎర్రబెల్లి ఆరోపించారు. బీడీ కట్టల మీద పుర్రె గుర్తును వేయించారని అన్నారు. అప్పుడు పార్లమెంటు సమావేశాలకు కూడా సరిగా హాజరుకాలేదని ఆరోపించారు.
తెలంగాణ ఉద్యమకారులను మోసం చేశారని కెసిఆర్పై ఎర్రబెల్లి దయాకర్ రావు ధ్వజమెత్తారు. తెలంగాణకు కుక్కలా పని చేస్తానని, తన కుటుంబం ఎవరూ రాజకీయాల్లోకి రారని చెప్పిన కెసిఆర్.. ఇప్పుడేం చేస్తున్నారని ప్రశ్నించారు. దళితుడ్ని ముఖ్యమంత్రిని చేస్తానని.. లేదంటే తన తల నరుక్కుంటానని చెప్పిన కెసిఆర్.. ఎందుకు నరుక్కోలేదని ప్రశ్నించారు. ఇన్ని మోసాలకు పాల్పడిన కెసిఆర్పై 420 కేసు పెట్టాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు. కెసిఆర్ అసమర్థ, నిర్లక్ష్య పాలన వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు.
చంద్రబాబుపై కెసిఆర్ చేస్తున్న ఆరోపణలు నిజమని నిరూపిస్తే టిడిపి నుంచి సన్యాసం తీసుకుంటామని ఎర్రబెల్లి అన్నారు. విద్యుత్ సమస్యలపై అఖిలపక్ష సమావేశం పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. జెఏసి ఛైర్మన్ కోదండరాం, ఇతర నేతలను కూడా పిలవండని అన్నారు. దమ్ముంటూ మార్కెట్ యార్డుకు రావాలని, చర్చించుకుందామని అన్నారు. సిఎం స్థాయిలో ఉండి ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. తెలంగాణలో పింఛను కోసం కూడా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
ఏపిలో చంద్రబాబు సిఎం కావడం వల్లే కెసిఆర్ ఏడుస్తున్నారని విమర్శించారు. అక్కడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సిఎం అయితే కెసిఆర్కు బాగుండేందని అన్నారు. తెలంగాణ కెసిఆర్, ఏపిలో జగన్ సిఎం అయితే ఇద్దరూ కలిసి దోచుకోవచ్చనే.. కెసిఆర్, జగన్మోహన్ రెడ్డి ఏపి సిఎం కావాలని కోరుకున్నారని ఆరోపించారు.
అందుకే ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ఏపి సిఎం అవుతున్నారని కెసిఆర్ వ్యాఖ్యానించారని ఎర్రబెల్లి గుర్తు చేశారు. జగన్ కూడా తెలంగాణలో కెసిఆర్ సిఎం కావాలని కోరుకున్నారని, ఇద్దరూ కలిసి రెండు రాష్ట్రాలను దోచుకువచ్చే ఆలోచనతో ఒకరికొకరు సహకరించుకున్నారని ఎర్రబెల్లి ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కార్యాలయాలపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోమని ఎర్రబెల్లి దయాకర్ రావు.. కెసిఆర్ను హెచ్చరించారు.