కెసిఆర్ ఎవరు: మీడియా బ్యాన్పై ఎర్రబెల్లి ఫైర్
హైదరాబాద్: తెలంగాణలో మీడియాను తొక్కేయడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఎవరని తెలంగాణ తెలుగుదేశం నేత ఎర్రబెల్లి దయాకర్రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణలో ఛానెళ్ల ప్రసారాలను నిలిపివేసి నిజాం నిరంకుశ పాలనను తలపిస్తున్నారని ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో తీవ్రంగా మండిపడ్డారు.
కెసిఆర్ తన వైఖరి మార్చుకోకపోతే అంతు చూస్తామని హెచ్చరించారు. వందరోజుల పాలనలో కేసీఆర్ వెయ్యి అబద్దాలు ఆడారని విమర్శించారు. మెదక్లో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. పోలీసులు, అధికారులను గుప్పిట్లో పెట్టుకున్నారన్నారు.
వంద రోజుల్లో తాను ఏ పనీ చేయలేదంటున్న కేసీఆర్కు ఎందుకు ఓటేయాలని ఆయన ప్రశ్నించారు. ఓట్ల కోసమే సంగారెడ్డి, సిద్ధిపేటను జిల్లాలుగా మారుస్తామని ప్రకటన చేశారని ఎర్రబెల్లి అన్నారు.గోల్కొండపై జెండా ఎగురవేసిన నాటి నుంచి కేసీఆర్లో నిజాం నిరంకుశత్వం ప్రవేశించిందని ఆయన దుయ్యబట్టారు.
సర్పంచ్లను తొలగించే అధికారం కెసిఆర్ ఎవరిచ్చారని ఎర్రబెల్లి నిలదీశారు. దమ్ముంటే బడ్జెట్ సమావేశాలు పెట్టాలన్నారు. తెలంగాణ ఇచ్చి అధికారం తెచ్చుకోలేని పార్టీ కాంగ్రెస్ అని, మెదక్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్తో కాంగ్రెస్ కుమ్మక్కయిందని ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు.