వరంగల్లో కేసీఆర్, ఎర్రబెల్లి ఆగ్రహం, తుళ్లూరు ఫైర్ ఘటనలో అరెస్ట్!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం నాడు వరంగల్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన హన్మకొండ వడ్డేపల్లి చెరువు వద్ద మిషన్ కాకతీయ పైలాన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
వరంగల్ జిల్లాలో ప్రధాన రహదారులను విస్తరిస్తామని చెప్పారు. దేవాదుల, కంతనపల్లి ప్రాజెక్టుల ద్వారా చెరువులు నింపేందుకు సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తామన్నారు. వరంగల్లో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తామన్నారు. మామునూరు విమానాశ్రయంలో ఎయిర్ స్ట్రిప్ట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
దేశ వస్త్ర పరిశ్రమ మొత్తం ఒక్కచోటే ఉండేలా ఈ వరంగల్ టెక్స్ టైల్ పార్క్ ఉంటుందన్నారు. దేశ ప్రజలంతా గర్వించేలా ఫిబ్రవరి లేదా మార్చిలో కాకతీయ ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు.

రాష్ట్రంలోని పది జిల్లాలతో పాటు గోల్కొండ కోటలోను వీటిని నిర్వహిస్తామన్నారు. ఇరవై లక్షల జనాభాకు అనువుగా వరంగల్ నగరాన్ని తీర్చిదిద్దుతామని చెప్పారు. కొత్త సంస్థలు, ఐటీ కంపెనీలను, వర్సిటీలను వరంగల్ జిల్లాకు తరలిస్తామని చెప్పారు.
ఒక్కరోజు సినిమా అట్టర్ ప్లాప్: ఎర్రబెల్లి
కేసీఆర్ వరంగల్ జిల్లా పర్యటన పైన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర రావు సోమవారం స్పందించారు. కేసీఆర్ ఒక్కరోజు సినిమా అట్టర్ ప్లాప్ అన్నారు. జిల్లాకు కేసీఆర్ ఏమిచ్చారో మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పాలన్నారు. కేసీఆర్ అరచేతిలో వైకుంఠం చూపించారని మండిపడ్డారు. కేసీఆర్ పర్యటనతో జిల్లాకు ఒరిగిందేమీ లేదన్నారు.
గుంటూరు ఫైర్ ఘటనలో ఇద్దరి అరెస్ట్
గుంటూరు జిల్లా రాజధాని పరిధిలోని తుళ్లూరు మండల పరిధిలో పంట చేలు దగ్ధం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారని తెలుస్తోంది. వెంకాయపాలెం సమీపంలో డీజిల్ క్యాన్లను పోలీసులు గుర్తించారు. పొలాల్లో ఉండే ఇంజిన్ల నుండి డీజిల్ తీసి దగ్ధం చేసినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications