డర్టీ డజన్: కెసిఆర్ కేబినెట్పై రేవంత్, ఎర్రబెల్లి పరామర్శ
మెదక్: ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సొంత నియోజకవర్గం గజ్వేల్లో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని తెలంగాణ తెలుగుదేశం నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు. మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో తెలుగుదేశం నేతల బృందం పర్యటించింది. పలు మండలాల్లో పర్యటించి ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించింది.
టిడిపి నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవంత్ రెడ్డి, ఇతర నేతలు బృంందంగా వెళ్లి రైతు కుటుంబాల సమస్యలను విన్నారు. జగదేవ్పూర్ మండలం అంగడికిష్టాపూర్లో పర్యటించి ఆత్మహత్య చేసుకున్న రైతు శ్రీశైలం కుటుంబాన్ని పరామర్శించారు. వారికి రూ. 50వేల ఆర్థిక సాయాన్ని అందించారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కేసీఆర్ కేబినెట్.. డర్టీ డజన్గా మారిందని ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు 360 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు.
మంత్రులు మొసలి కన్నీరు ఆపి.. రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతు కన్నెర్ర చేస్తే ప్రభుత్వం మాడిమసైపోతుందని హెచ్చరించారు. బాధిత కుటుంబాలకు రూ. 10 లక్షల పరిహారం ఇవ్వాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతుల పక్షాన అసెంబ్లీలో పోరాడుతామని చెప్పారు.
మరో నేత ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. కెసిఆర్ దిగివచ్చే వరకు తమ పోరాటం ఆగదని చెప్పారు. సిఎం కెసిఆర్ బెట్టుకు పోకుండా రైతుల ప్రాణాలను కాపాడాలని అన్నారు. ఆత్మహత్య చేసుకున్న ఒక్క రైతు కుటుంబాన్ని కూడా ఏ మంత్రీ పరామర్శించలేదని అన్నారు తమది నక్సల్స్ ఎజెండా అన్న కెసిఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మావోయిస్టులు బంద్ పిలుపు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు.