ఏపీలో ఈఎస్ఐ స్కాం: అచ్చెన్నాయుడిపై అభియోగం బీసీలపై దాడి, మాజీమంత్రి కొల్లు రవీంద్ర
ఈఎస్ఐ స్కాంలో అచ్చెన్నాయుడుని ఇరికించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. టెలీ హెల్త్ సర్వీసెస్ పరిమితి రూ.10 కోట్ల వరకు ఉంటే.. రూ.100 కోట్ల కుంభకోణం ఎలా జరిగిందని ప్రశ్నించారు. ప్రభుత్వం కావాలనే అచ్చెన్నాయుడిని ఇరికిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. దీనిని తాము ఖండిస్తున్నామని చెప్పారు.

బీసీ నేతలే టార్గెట్..
బీసీ నేతలను వైసీపీ సర్కార్ టార్గెట్ చేసిందని దుయ్యబట్టారు. బీసీలను అణగదొక్కాలని సీఎం జగన్ చూస్తున్నారని ఆరోపించారు. అందుకోసమే లేని పోని ఆరోపణలు అచ్చెన్నాయుడుపై చేస్తున్నారని ఫైరయ్యారు. ఏదో ఒక స్కాంలో ఇరికించాలని అచ్చెన్నాయుడు పేరు తెరపైకి తీసుకొచ్చారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. జగన్ సర్కార్ చేస్తున్న అవినీతిని ప్రశ్నిస్తే.. చివరికి అచ్చెన్నాయుడపై అభియోగాలు మోపడం దారుణమన్నారు. తప్పుడు కేసులతో ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోబోమని, పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని స్పష్టంచేశారు.

కేసులను మళ్లించేందుకే..
వైసీపీ నేతలపై ఉన్న కేసులను దారి మళ్లించేందుకే కొత్త కేసులను తెరపైకి తీసుకొస్తున్నారని విమర్శించారు. మందులు కొనుగోలు చేశారని అచ్చెన్నాయుడిపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఇది ఒక్క అచ్చెన్నాయుడిపై జరుగుతున్న దాడి కాదని.. రాష్ట్రంలో ఉన్న బీసీలపై జరుగుతున్న దాడిగా భావిస్తున్నామని పేర్కొన్నారు.

అచ్చెన్నాయుడు వాదన ఇదీ
అంతకుముందు ఈఎస్ఐ స్కాంపై మాజీమంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు. తాను తప్పు చేయలేదని, చేయబోనని స్పష్టంచేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాల మేరకే టెలీ హెల్త్ సర్వీసెస్కు నామినేషన్ పద్దతిలో కేటాయించాలని తాను లేఖ రాసినట్టు వివరించారు. మిగతా రాష్ట్రాల ఏ విధానాలు అవలంభించాయో అలా వ్యవహరించాలని సూచించానని తెలిపారు. కానీ కొందరు పనిగట్టుకొని తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని, ఇది సరికాదని మండిపడ్డారు.

ఇలా వెలుగులోకి..
టెలీ హెల్త్ సర్వీసెస్కు మేలు జరిగేలా నామినేషన్ పద్ధతిలో మందులు ఇవ్వాలని అప్పటి మంత్రి అచ్చెన్నాయుడు అధికారులకు లేఖ రాశారు. దీంతో రూ.400 కోట్ల వరకు ప్రజాధనం దోపిడికి గురైంది. ఈ విషయం విజిలెన్స్ అధికారుల విచారణలో బయటపడింది. దీనిపై అచ్చెన్నాయుడు స్పందించగా.. మంత్రి జవహర్ కూడా రియాక్టయ్యారు. తప్పుచేసినవారిపై చర్యలు తప్పవని హెచ్చరించిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications