బందర్ టెక్కీ అనూహ్య కేసు: చంద్రభానును దోషిగా తేల్చిన కోర్టు
ముంబై/మచిలీపట్నం: కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన ఎస్తేర్ అనూహ్య అత్యాచారం, హత్య కేసులో నిందితుడు చంద్రభాన్ సనప్ను ముంబై న్యాయస్థానం దోషిగా నిర్దారించింది. అతనికి బుధవారం నాడు శిక్షను ఖరారు చేయనుంది.
23 ఏళ్ల టిసిఎస్ ఉద్యోగిని అనూహ్య గత ఏడాది జనవరి 5వ తేదీన విజయవాడ నుంచి ముంబై వెళ్తుండగా అదృశ్యమైంది. ఆ తర్వాత విగతజీవిగా కనిపించింది. ఈ కేసును పోలీసులు సిసిటివి ఫుటేజ్ ఆధారంగా చేధించారు. ఈ కేసులో చంద్రభానును దోషిగా న్యాయస్థానం తేల్చింది.
ఛార్జీషీట్లో పేర్కొన్న వివరాల ప్రకారం... దోషిగా తేలిన చంద్రభాన్ అనూహ్యను కలిసి.. తాను రూ.300కు అంధేరీలో దించుతానని చెప్పాడు. ఆ తర్వాత అతను ఆమెను మధ్యలోనే అత్యాచారం చేసి, చంపేశాడు. చంద్రభానుకు న్యాయస్థానం రేపు (బుధవారం) శిక్ష ఖరారు చేయనుంది.
కాగా, మహారాష్ట్ర రాజధాని ముంబైలో నిరుడు అత్యాచారానికి హత్యకు గురైన ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ అనూహ్య(23) కేసులో ఈ ఏడాది జూన్ నెలలో స్థానిక సెషన్స్ కోర్టు 39 మంది సాక్షుల వాంగ్మూలాల నమోదును పూర్తిచేసింది.
టీసీఎస్ కంపెనీ అసిస్టెంట్ సిస్టమ్ ఇంజినీర్ అయిన ఆమె నిరుడు జనవరి 5న ముంబై వచ్చినప్పుడు ఆమె అత్యాచారానికీ, హత్యకు గురైంది. కుర్లా రైల్వే స్టేషన్లోని లోకమాన్య తిలక్ టెర్మినస్ వద్ద దిగిన తర్వాత అనూహ్య అదృశ్యమయ్యింది.
రైల్వే స్టేషన్లో ఒంటరిగా కూర్చున్న ఆమెను చంద్రభాన్ సనప్(28) అనే వ్యక్తి తన బైక్పై లిఫ్ట్ ఇస్తానని మభ్యపెట్టి నిర్జన ప్రదేశానికి తీసుకుపోయాడు. అనూహ్య దగ్గర ఉన్న డబ్బును దోచుకునేందుకు ప్రయత్నించగా, ఆమె ప్రతిఘటించడంతో చంపేశాడని పోలీసులు తెలిపారు.
ఆమె అత్యాచారానికి కూడా గురైనట్లుగా అనుమానిస్తున్నట్లు నాడు పోలీసులు తెలిపారు. ఈ సంఘటన జరిగిన 11 రోజుల తర్వాత ఆమె మృతదేహాన్ని ముంబై శివారులో భండప్ వద్ద పోలీసులు కనుగొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని బందరుకు చెందిన అనూహ్య ముంబైలోని టిసిఎస్లో పనిచేస్తూ ముంబైలోని అందేరీలో ఉండేది.
క్రిస్మస్ పండుగకు 2013 డిసెంబర్ 22వ తేదీన మచిలీపట్నం వచ్చిన అనూహ్య నిరుడు జనవరి 5వ తేదీన ముంబై చేరుకుంది. ఆమె ముంబైలోని ఎల్ఎఎల్టి నుంచి కనిపించకుండా పోయింది. ఆమె శవం జనవరి 16వ తేదీన భందుప్ (తూర్పు)లోని టాటా నగర్ పొదల్లో కనిపించింది.