అణిచివేసినా..: నిజాంకు ఈటెల కితాబు, సభలో రగడ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి శాసన సభా పక్ష నేత ఈటెల రాజేందర్ నిజాం ప్రభువుకు కితాబివ్వడం సభలో గందరగోళానికి దారి తీసింది. తెలంగాణ ముసాయిదా బిల్లు పైన పయ్యావుల కేశవ్ మాట్లాడుతుండగా మంత్రి శైలజానాథ్, ఈటెల రాజేందర్లు కొన్నింటిపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
శైలజానాథ్ వర్సెస్ పయ్యావుల
పయ్యావుల సోనియాను ఇటాలియన్ గాంధీ అన్నప్పుడు కాంగ్రెసు నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దానికి పయ్యావుల స్పందిస్తూ... సోనియా గాంధీ ఇటాలియన్ అని, అందులో ఎలాంటి అనుమానం లేదన్నారు. దేశంలో కులాలు మతాలు, ప్రాంతాలపై సోనియాకు అవగాహన లేదన్నారు.
దానికి శైలజానాథ్ స్పందిస్తూ... రాష్ట్రంలో ఈ దుస్థితికి కారణం టిడిపి అన్నారు. సోనియా గురించి మాట్లాడే అర్హత, అధికారం టిడిపికి లేదన్నారు. మీకు చిత్తశుద్ధి, దమ్ము, ధైర్యం ఉంటే చంద్రబాబు అభిప్రాయం సభలో చెప్పించాలన్నారు. ఆంధ్రుల ఆరాద్య దైవం స్వర్గీయ నందమూరి తారక రామారావును మానసికంగా హత్య చేసి వెన్నుపోటు పొడిచారన్నారు. బాబుకు దమ్ముంటే సభలో సమైక్యం గురించి అనౌన్స్ చేయాలన్నారు.
నిజాంపై ఈటెల.. రగడ
పయ్యావుల కేశవ్ చెబుతున్న చరిత్ర తప్పుల తడక అన్నారు. చాకలి ఐలమ్మ, బీంరెడ్డిల గురించి గొప్పగా చెప్పారని కానీ, వారికి షెల్టర్ ఇవ్వలేదన్నారు. ఉద్యమకారులను వ్యాపారం చేసుకున్నారని ఆరోపించారు. మాటల గారడీతో పయ్యావుల తప్పు పట్టిస్తున్నారని ఆరోపించారు. నాటి సిఎం బూర్గుల అధిష్టానం మాట వింటే, నేటి సిఎం కిరణ్ వినడం లేదన్నారు. దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేసిన చరిత్ర తమదని, అణిచివేత తమకు తెలియదన్నారు. నిజాం నిరంకుశంగా పాలించవచ్చునని, బానిసత్వంలో ఉంచవచ్చునని, అణిచివేయవచ్చునని కానీ పరిశ్రమలను, కళాశాలలను ఇచ్చారన్నారు.
ఈటెల వ్యాఖ్యలపై శైలజానాథ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. నిజాం ప్రభువును కీర్తించడం భారత రాజ్యాంగానికి, భారతీయులకు వ్యతిరేకమన్నారు. దౌర్జన్యం ఉండొచ్చట.. బానిసత్వం ఉండొచ్చట.. దుర్మార్గం ఉండొచ్చట. ఇదెక్కడిదన్నారు. నిజాం సంస్థాన ప్రజలు ఆహ్వానిస్తే భారత ప్రభుత్వం నిజాం రాజను ఓడించి స్వాధీన పర్చుకుందన్నారు. నాడు మోసగించబడ్డ రైతులు, చెరచబడ్డ మహిళలను కించపర్చినట్లుగా ఈటెల వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. నిజాంను పొగడటం అంటే తెలంగాణ ప్రజలను అవమానించినట్లేనని, ఉద్యమంలో అనేక మంది అసులువులు బాసారన్నారు.