తెలుగు రాష్ట్రాల్లో కనుమ శోభ.. ప్రభల తీర్థంలో యూత్ బిజీ
కనుమ.. ముక్కతో పండుగ స్టార్ట్ అవుతుంది. అవును సంక్రాంతి రోజున పిండి వంటలు, స్వీట్లు, పతంగులు ఎగరేసి గడుపుకుంటారు. కనుమ రోజున నాన్ వెజ్ పండగ జరుపుకుంటారు. సంక్రాంతి పండుగను రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో సంబరంగా జరుపుకున్నారు. రెండు రోజుల పాటు ఆనందోత్సాహాలతో గడిపిన ప్రజలు మూడో రోజు కనుమ పండుగను విశిష్టంగా జరుపుకుంటున్నారు. కనుమ పండుగ పురస్కరించుకుని ఉభయ గోదావరి జిల్లాలో ప్రభల ఉత్సవం నిర్వహించారు.
కనుమ రోజున ప్రభల జాతర ఉత్సవం.. కోనసీమ గ్రామాల్లో 400 ఏళ్ల సంప్రదాయంగా కొనసాగిస్తున్నారు. ప్రభల తీర్థంలో పాల్గొనేందుకు యువకులు ఎంతో ఉత్సాహం చూపిస్తారు. భారీ ఎత్తైన ప్రభలు ఏర్పాటు చేసి విశిష్టతను చాటుతారు. కనుమ సందర్భంగా ఆదివారం తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం జగ్గన్నతోటకు భారీ ప్రభలు చేరుకున్నాయి. మండలంలోని 11 గ్రామాల నుంచి ప్రభలు జగ్గన్నతోటకు చేరుకున్నాయి. భారీ ప్రభలను యువకులు తమ భుజాలపై మోసుకుంటూ జగ్గన్నతోటకు చేర్చారు.
మండలంలోని వాకలగరువు, తొండవరం గ్రామాల నుంచి ఎత్తయిన ప్రభలు వస్తుంటాయి. ప్రభల తీర్థం సందర్భంగా ఏకాదశ రుద్రుల దర్శనం కోసం భక్తులు, కోనసీమ ప్రజలు పెద్ద సంఖ్యలో జగ్గన్నతోటకు తరలివస్తున్నారు. ప్రభల జాతర సందర్బంగా జగ్గన్నతోట వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజల సౌకర్యార్ధం జగ్గన్నతోటకు చేరుకునే రహదారిని తీర్చిదిద్దారు.
సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలో చేరుకునే రోజు సంక్రాంతి. భోగి పండగ సాధారణంగా ప్రతి ఏడాది జనవరి 13 లేదా జనవరి 14 తేదీలలో వస్తుంది. ఉత్తరాయణం ముందురోజుకి చలి విపరీతంగా పెరగడం ఈ చలిని తట్టుకునేందుకు భగ భగ మండే మంటలు అందరు వేయటం వలన ఈ రోజుకు భోగి అనే పేరు వచ్చిందని పెద్దలు చెబుతారు. భోగి రోజున తెల్లవారు జామునే లేచి.. అభ్యంగ స్నానమాచరించి.. కొత్త బట్టలు ధరించి కుటుంబ సభ్యులు, స్నేహితులతో సంతోషంగా గడిపారు. పండగను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు.