ఆశ్చర్యం: 'వైయస్ జగన్ ఆస్తులు పంచితే ఒక్కో నియోజకవర్గానికి రూ.750 కోట్లు'
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన ఆస్తులతో ఒక్కో నియోజకవర్గానికి రూ.750 కోట్లు ఇవ్వవచ్చునని తెలుగుదేశం పార్టీ నేత, శాసన మండలి సభ్యులు బుద్ధా వెంకన్న గురువారం అన్నారు.
2004 ఎన్నికలకు ముందు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పాదయాత్రలో భూములు, గనులు అన్వేషించారని, అధికారంలోకి వచ్చాక వాటిని దోచుకొని ఇడుపులపాయలో దాచుకున్నారన్నారు.
నాడు వైయస్ పాదయాత్ర చేసి రాష్ట్ర సంపదను కాంగ్రెస్ పెద్దలకు దోచిపెట్టారని ఆరోపించారు. మళ్లీ ఇప్పుడు జగన్ అదే చేయాలని చూస్తున్నారన్నారు. జగన్ పాదయాత్రను ప్రతి గ్రామంలో అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.
రాబోయే మరో ముప్పై సంవత్సరాలు తెలుగుదేశం పార్టీయే అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో కోట్లాది రూపాయలు వెదజల్లే సంస్కృతి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీయే అన్నారు. రాష్ట్రాన్ని దోచుకున్నది కాంగ్రెస్, వైసిపిలే అన్నారు.
గతంలో చంద్రబాబు పథకాలను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పొగిడారని గుర్తు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ పార్టీకి, దిగ్విజయ్ సింగ్కు నవ్యాంధ్ర గురించి మాట్లాడే హక్కు లేదన్నారు.