YS Viveka Case: కేసీఆర్-జగన్ ఇద్దరూ ఒకటే : జరిగేదిదే - ఆదినారాయణరెడ్డి..!!
YS Viveka Case: వైఎస్ వివేకా హత్య కేసు విచారణపై మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. తాజాగా వివేకా హత్య కేసు విచారణను సుప్రీంకోర్టు తెలంగాణకు బదిలీ చేసింది. వివేకా కుమార్తె సునీత అభ్యర్ధన మేరకు సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కేసు విషయంలో ఇప్పటికే టీడీపీ నేత బీటెక్ రవి, ప్రస్తుత బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి పైన ఆరోపణలు వచ్చాయి. గతంలోనే ఆదినారాయణ రెడ్డి వీటిని ఖండించారు. ఇక, ఇప్పుడు సుప్రీంకోర్టు తాజా నిర్ణయం పైన ఆదినారాయణ రెడ్డి స్పందించారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ తెలంగాణకు బదిలీ చేసినా న్యాయం జరుగుతుంద్న నమ్మకం తనకు లేదని ఆదినారాయణ రెడ్డి చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్..ఏపీ సీఎం జగన్ ఇద్దరూ ఒకటేనని పేర్కొన్నారు. దీంతో, తెలంగాణలో న్యాయం జరుగుతుందా అనే అనుమానాలు చాలా మందికి ఉన్నాయని ఆదినారాయణ రెడ్డి చెప్పుకొచ్చారు.
నాడు వివేకా హత్య కేసు పై చంద్రబాబు ప్రభుత్వం సిట్ వేస్తే, సీబీఐ కావాలని జగన్ డిమాండ్ చేసారని గుర్తు చేసారు. ఇప్పుడు ఆ డిమాండ్ ఎందుకు చేయటం లేదని ప్రశ్నించారు. వివేకా హత్య కేసు తరువాత అనేక కట్టుకధలు అల్లారని ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు. ఉద్దేశ పూర్వకంగానే గుండెపోటుగా ప్రచారం చేసారంటూ వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి వై నాట్ 175 అంటూ చేస్తున్న ప్రచారం పైన ఆదినారాయణ రెడ్డి స్పందించారు. 175 సీట్లు వైసీపీకి వచ్చే ఎన్నికల్లో ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారని వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిపించాలని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం పైన తీవ్ర ఆరోపణలు చేసారు.
2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి జమ్మలమడుగు ఎమ్మెల్యేగా గెలిచిన ఆదినారాయణ తరువాత టీడీపీలో చేరి మంత్రి అయ్యారు. 2019 ఎన్నికల్లో కడప ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత బీజేపీలో చేరారు. ఇక, ఇప్పుడు సుప్రీం కోర్టు తెలంగాణకు వివేకా కేసు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్న తరువాత ఆదినారాయణ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయంగా వైరల్ అవుతున్నాయి.