రాజధానిలో భూముల కొనుగోలు: చంద్రబాబుకు మద్దతుగా మాజీ మంత్రి
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ 'ఆపరేషన్ ఆకర్ష్' కు తెరలేపిన నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎనిమిది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ వలసల నేపథ్యంలో అటు ప్రతిపక్షానికి చెందిన ఎమ్మెల్యేలతో పాటు, కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా టీడీపీలోకి చేరేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలిస్తే తాను టీడీపీలో చేరతానని మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన బాపట్లలోని తన ఇంటిలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు పార్టీలోకి రమ్మని పిలిస్తే చేరేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
ఈ సందర్భంగా ఆయన ఏపీలో ప్రస్తుతం పెద్దఎత్తున చర్చ జరుగుతున్న అమరావతి భూదందాపై స్పందించారు. రాజధాని అమరావతిలో భూములు కొనుగోలు చేయడంలో తప్పులేదన్నారు. భూసమీకరణ కింద రాజధానిని నిర్మిస్తున్న గ్రామాల్లో భూములను కొనుగోలు చేసి ప్రభుత్వానికి ఇవ్వకపోతే తప్పు అవుతుందన్నారు.
అంతేగానీ రాజధాని చుట్టుపక్కల గ్రామాల్లోని భూములను కొనుగోలు చేయడం తప్పు ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. రాజధాని భూదందా అంటూ టీడీపీ నేతలపై ఆరోపణలు చేస్తున్న వైసీపీ నేతలే ఆ అక్రమాలను నిరూపించాలని ఆయన సూచించారు.
రాజధాని అమరావతిలో భూముల కొనుగోలుపై అక్రమాలు జరిగాయని ఆధారాలు ఉంటే హైకోర్టులో పిటిషన్ వేసి సీబీఐ విచారణను కోరాలని ఆయన సూచించారు. పత్రికల్లో వార్తలను ప్రచురించడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని చెప్పారు. రాజధాని ప్రాంతంలో అన్ని పార్టీల వారు భూములను కొనుగోలు చేశారని తెలిపారు.
గురువారం రాత్రి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ భూకుంభకోణం జరిగిందని కథనాలు ప్రచురిస్తున్న సాక్షి పత్రికపైనా, సీబీఐ విచారణ జరపాలన్న వైసీపీ నేతల డిమాండ్లపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే.
''ఎందుకయ్యా విచారణ? ఏం జరిగిందని విచారణ? ఎవరి డబ్బులు పెట్టి వారు భూములు కొనుక్కుంటే నాకేం సంబంధం? అంటూ మండిపడ్డారు. ఎక్కడైనా అవినీతి ఉంటే చర్యలు తీసుకోవచ్చని, అంతేగానీ భూములు కొనుక్కుంటే కాదని స్పష్టం చేశారు. తన ప్రభుత్వంలో ఎవరు తప్పు చేసినా తాట తీస్తానని తెలిపారు.
''ఎవరో భూములు కొనుక్కుంటే అది మాకు అనవసరం. నాకు కావలసింది నిబంధనలు పాటించారా లేదా అన్నదే'' అని చంద్రబాబు తెలిపారు. రాజధానికి సంబంధించిన 55 వేల ఎకరాలు ఎక్కడికీ పోలేదని, అక్కడే ఉన్నాయని తెలిపారు. రైతుల వాటా భూమిని అభివృద్ధి చేసి ఇవ్వాల్సి ఉందన్నారు.