సస్పెన్స్ కు తెర దించనున్న కన్నా.. జనసేనలో చేరేది ఎప్పుడంటే!!
భారతీయ జనతాపార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుత పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజుతో కన్నాకు సత్సంబంధాలు లేవు. భవిష్యత్తులో కూడా విభేదాలు సర్దుకునే పరిస్థితి కనపడకపోవడంతో బీజేపీనీ వీడాలని కన్నా నిర్ణయించుకున్నారు. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఇటీవలే కన్నా ను కలిసి చర్చించారు. అప్పుడే ఆయన పార్టీని వీడతారంటూ ప్రచారం సాగినప్పటికీ పార్టీ అధిష్టానం నుంచి ఫోన్ రావడంతో లక్ష్మీనారాయణ వెనక్కి తగ్గారు.
సోముపై కన్నా ఆగ్రహం
కొద్ది నెలలుగా కొనసాగుతున్న సస్పెన్స్ కు తెరదించుతూ ఈనెల 26వ తేదీన ఆయన జనసేనలో చేరబోతున్నారు. నాదెండ్ల మనోహర్ తో చర్చలు జరపడంపై సోము ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత కన్నా వ్యక్తిగత పనిపై కాకినాడకు వెళ్లగా బీజేపీ నేతలు ఆయన్ని కలవడంపై కూడా సోము ఆగ్రహం వ్యక్తం చేశారు.
సోము వీర్రాజు వైఖరివల్లే జనసేన ఏపీలో బీజేపీకి దూరమైందని కన్నా ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ ఇద్దరు నేతల మధ్య అగాధం పెరిగిపోయింది. తాను నియమించిన పార్టీ జిల్లా అధ్యక్షులను, ఇతర అనుబంధ విభాగాల్లోని పదవుల్లో ఉన్నవారిని తనతో మాటమాత్రం కూడా చర్చించకుండా తొలగించారంటూ కన్నా మండిపడ్డారు.
కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే..
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు రెండురోజులపాటు భీమవరంలో జరగనున్నాయి. 24, 25 తేదీల్లో జరిగే ఈ సమావేశానికి ఇద్దరు కేంద్ర మంత్రులు హాజరవుతున్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తుకు సంబంధించి కార్యవర్గ సమావేశాల్లో ఒక నిర్ణయం తీసుకుంటారంటూ వార్తలు వస్తున్నాయి. సమావేశాలు జరుగుతున్న సమయంలోనే కన్నా జనసేనలో చేరాలనే నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కన్నా చేరిక జనసేనను జిల్లాలో మరింత బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు.
కన్నా చేరికతో జనసేన బలోపేతం?
టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకొని ముందుకు వెళుతున్న క్రమంలో గుంటూరు జిల్లాలో తెనాలి, సత్తెనపల్లి, గుంటూరు పశ్చిమ స్థానాలను కేటాయించాల్సిందిగా జనసేన పార్టీ టీడీపీని కోరినట్లు తెలుస్తోంది. తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్, సత్తెనపల్లి నుంచి యర్రం వెంకటేశ్వరరెడ్డి, గుంటూరు పశ్చిమ నుంచి గుంటూరు పశ్చిమ నుంచి కన్నా లక్ష్మీనారాయణ పోటీచేస్తారని సమాచారం.
అయితే దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. గుంటూరు తూర్పు, పశ్చిమ, పెదకూరపాడు, సత్తెనపల్లి, తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాల్లో వర్గబలం ఉన్న కన్నా చేరిక జనసేనను మరింత బలోపేతం చేస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.