మాజీ మంత్రి మోపిదేవి కారును ఢీ కొన్న ఆర్టీసీ బస్సు: భార్యా కూతుళ్లకు గాయాలు
విజయవాడ: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణ కుటుంబం ప్రయాణిస్తున్న కారు బుధవారం ప్రమాదానికి గురైంది. భార్య, కూతురితో కలిసి మోపిదేవి ప్రయాణిస్తున్న కారును కృష్ణా జిల్లా కానూరు వద్ద ఉయ్యూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో మోపిదేవి వెంకట రమణ సతీమణి, కుమార్తెకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకుని ప్రాథమిక చికిత్స నిమిత్తం విజయవాడలోని రమేశ్ ఆసుపత్రికి తరలించారు.
లారీ ఢీకొని ఇద్దరు మహిళలు మృతి
తూర్పుగోదావరి జిల్లా అన్నవరంకు సమీపంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారి పక్కనే ఉన్న వారిపైకి లారీ దూసుగెళ్లడంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను చిత్తూరు జిలాల వాసులుగా గుర్తించారు.
లారీని ఢీకొన్న ప్రైవేటు బస్సు
విజయనగరం జిల్లా భోగాపురం జాతీయరహదారిపై టోల్గేట్ వద్ద ఆగి ఉన్న లారీని ప్రైవేటు బస్సు డీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజమండ్రి గోదావరి పుష్కరాలకు వెళ్లి తిరిగి వస్తున్న 9 మంది యాత్రికులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.