కాపులను బీసీల్లో చేర్చే అంశంపై చిత్తశుద్ధి ఉందా?: చంద్రబాబుకు ముద్రగడ సూటి ప్రశ్న
అమరావతి: కాపులను బీసీల్లోకి చేర్చాలనే అంశంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే కాపులను బీసీల్లోకి చేర్చాలని, కమిషన్ పేరుతో కాలయాపన చేయడం సరికాదని చంద్రబాబుకు మంగళవారం ఆయన లెటర్ రాశారు.
కమిషన్ వేస్తే ఆ రిపోర్టు రావడానికి మరో జన్మ ఎత్తాల్సి ఉంటుందని ముద్రగడ అందులో పేర్కొన్నారు. కమిషన్లు, జీవోల పేరుతో వంకలు పెడుతున్నారని, కాపులను బీసీల్లో చేర్చే అంశంపై మీకు చిత్తశుద్ధి ఉందా? అని సూటిగా ప్రశ్నించారు. జనాభాకు సంబంధించిన అన్ని వివరాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయని నెలరోజుల్లో కాపులను బీసీల్లో చేర్చొచ్చన్నారు.

కాపుల ఉద్యమానికి స్ఫూర్తి ఎవరో మీకు తెలియదా అని చంద్రబాబుని సూటిగా ప్రశ్నించారు. తమ పోరాటం కాపుల్లోని నిరు పేదల కోసమేనన్నారు. గతంలో మీ మద్దతుతోనే తాను కాపుల కోసం ఉద్యమం చేశానని ఈ సందర్భంగా చంద్రబాబుకు ఆయన గుర్తు చేశారు. ఇప్పటికైనా కాపులను బీసీల్లో చేర్చే అంశంపై వంకర మాటలు మానుకోవాలన్నారు.
అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు, అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచిందని కానీ హామీలు నెరవేర్చకుండా కమిషన్ పేరుతో కాలయాపన చేస్తున్నారని ముద్రగడ తన లేఖలో పేర్కొన్నారు.
కాపులను బీసీల్లో చేర్చడంపై ప్రభుత్వం ఆలస్యం చేస్తే, త్వరలో తూర్పుగోదావరిలోని తునిలో నిర్వహించనున్న సమావేశంలో తమ భవిష్యత్త్ కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన హెచ్చరించారు.












Click it and Unblock the Notifications