పవన్ కళ్యాణ్, లోకేష్ లను నిలదీసి, చంద్రబాబుకు రోజా డిమాండ్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి పాలనలో మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయని వైసిపి నేతలు తీవ్రస్థాయిలో ఏపీ ప్రభుత్వం పైన మండిపడుతున్నారు. హోంశాఖ మంత్రిగా మంగళ పూడి అనిత మహిళలపై జరుగుతున్న దారుణాలను అరికట్టడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఇదే సమయంలో తాజాగా మాజీమంత్రి రోజా చంద్రబాబు ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు.
రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేసిన రోజా
నగిరిలో మీడియాతో మాట్లాడిన రోజా.. మహిళలకు రక్షణ కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతున్నాయన్నారు. మహిళలకు భద్రత కల్పించలేకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనిత రాజీనామా చేయాలని మాజీ మంత్రి ఆర్కే రోజా డిమాండ్ చేశారు.

పోలీసులు ఉంది అందుకే
మహిళలపై తరచూ నేరాలు జరుగుతున్నా చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలపై జరుగుతున్న దారుణాలను పట్టించుకోకుండా వ్యవహరిస్తోందని అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుందని ప్రశ్నించిన రోజా, పోలీస్ వ్యవస్థను ప్రత్యర్థులను టార్గెట్ చెయ్యటానికి, వారిపై కక్ష సాధింపు చర్యలకు దిగటానికి మాత్రమే వాడుతున్నారన్నారు.
మహిళలపై దాడులు మీకు కనిపించటం లేదా?
బద్వేల్లో యువతిపై దారుణంగా అత్యాచారం చేసి హత్య చేయడం, తెనాలిలో బ్రెయిన్ డెడ్ అయిన మహిళపై దాడి వంటి ఇటీవలి సంఘటనల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇన్ని విషాదాలు చోటు చేసుకున్నప్పటికీ బాధిత కుటుంబాలను పరామర్శించకుండా ఎమ్మెల్యే బాలకృష్ణతో కలిసి టీవీ షో రికార్డింగ్కు హాజరయ్యేందుకు సీఎం చంద్రబాబు హైదరాబాద్ వెళ్లారని మాజీ మంత్రి ఆర్కే రోజా దుయ్యబట్టారు.మహిళలపై దాడులు పవన్ కళ్యాణ్ కు, లోకేష్ కు కనిపించటం లేదా అని ప్రశ్నించారు.
పవన్ కళ్యాణ్ హామీలను వదిలేసి మౌనం
నేరస్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని గతంలో ఇచ్చిన హామీలను ప్రశ్నిస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ అంశంపై మౌనం వహించారని మాజీ మంత్రి రోజా విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం శాంతిభద్రతల పరిరక్షణకు బదులు పోలీసులను వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వం రాజకీయ పగలు, వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టడంపైనే ఎక్కువ దృష్టి సారిస్తోందని రోజా అభిప్రాయపడ్డారు.
తక్షణం దిశా చట్టం అమలుకు డిమాండ్
మహిళా భద్రత కోసం ప్రభుత్వం తక్షణమే దిశా చట్టాన్ని అమలు చేయాలని, మహిళా పోలీస్ స్టేషన్లను పునరుద్ధరించాలని మాజీ మంత్రి రోజా డిమాండ్ చేశారు. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో దిశా యాప్ ద్వారా ఎంతో మంది మహిళలకు న్యాయం చేశామన్నారు. మహిళల భద్రతపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications