ఎగ్జిట్ పోల్స్ వైసీపీకే అనుకూలం : 23న ఫలితాలు భిన్నంగా ఉంటాయా : సీఎం వ్యాఖ్యల పరమార్ధం ఏంటి..!
ఏపీలో ఎన్నికల ఫలితాల పైన ఉత్కంఠ రోజురోజుకీ పెరుగుతోంది. రెండు ప్రధాన పార్టీలు టీడీపీ..వైసీపీ గెలుపు పైన ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే, తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చకు కారణమవుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అనుకూలంగా ఉండవని ముందే చెప్పేసారు. అదే సమయంలో..23న ఫలితాలు మాత్రం అనుకూలమని చంద్రబాబు చెబుతున్నారు. అంటే..ఎగ్జిట్ పోల్స్కు భిన్నంగా ఫలితాలు ఉంటాయా.. లేక, ఫలితాల వరకు అలా చెబుతున్నారా అనే చర్చ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.

ఎగ్జిట్ పోల్స్ వైసీపీకే అనుకూలమంటూ..
ముఖ్యమంత్రి చంద్రబాబుతో మంత్రులు సమావేశమైన సమయంలో ఫలితాల గురించి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. ఎగ్జిట్ పోల్స్ ద్వారా గందరగోళం సృష్టిస్తారని..ఆ సమయంలో ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. పరోక్షంగా ఎగ్జిట్ పోల్స్ వైసీపీకి అనుకూలంగా ఉంటాయని చెప్పకనే చెప్పారు. అయితే, దీనికి కొనసాగింపుగా 23న వెలువడే ఫలితాలు మాత్రం ఖచ్చితంగా టీడీపీకి అనుకూలంగా ఉంటాయని గట్టిగా చెబుతున్నారు. ఇప్పుడు దీని పైనే టీడీపీలో చర్చ మొదలైంది. ఎగ్జిట్ పోల్స్ టీడీపీకి అనుకూలంగా ఉండవని ముందుగానే అంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నప్పుడు.. ఫలితాలు మాత్ర ఎగ్జిట్ పోల్స్కు విరుద్దంగా అంటే టీడీపీకి అనుకూలంగా ఉంటాయని ఎలా చెప్పగలుగుతున్నారనే ప్రశ్న వినిపిస్తోంది. ఒకటి రెండు సందర్భాల్లో మినహా అంకెలు మారినా..ఎగ్జిట్ పోల్స్లో పబ్లిక్ పల్స్ స్పష్టం అవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు టీడీపీ నేతలనే గందరగోళం సృష్టిస్తున్నాయి.

గతంలోనూ వైసీపీకే అనుకూలంగా..
ఏపీలో ఎన్నికల షెడ్యూల్ రాకముందూ..ఆ తరువాత వచ్చిన అనేక సర్వేలు వైసీపీకే అనుకూలంగా అంచనాలు ఉన్నాయి. ఆ సమయంలో ఇదంతా వైసీపీ ఆడుతున్న మైండ్గేమ్ అని..ప్రజలు తమతోనే ఉన్నారంటూ టీడీపీ నేతలు చెబుతూ వచ్చారు. తిరిగి ఇప్పుడు ఈనెల 19న వెల్లడయ్యే ఎగ్జిట్ పోల్ అంచనాలను టీడీపీ అధినేత ముందు గానే అంచనా వేస్తున్నారు. కానీ, ఫలితాల విషయం పైన ధీమా వ్యక్తం చేస్తున్నా.. ముందుగా చెబుతున్న అంశాలు ఆ ధీమా మీద నమ్మకం కలిగించటం లేదు. అయితే, ఎక్కడా ఒక్క సర్వే కూడా టీడీపీకి అనుకూలంగా రాకపోవటం పైన టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 19న తమకు అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ ఉండే అవకాశం లేదని ఏకంగా చంద్రబాబు చెబుతున్న సమయంలో ఇక, ఆ రోజు అంచనాలను చూడాల్సిన అవసరం లేదనే నిర్ణయానికి వచ్చేసారు.

విమర్శలకు అవకాశం ఇచ్చేలా..
ఎగ్జిట్ పోల్స్ తమకు అనుకూలంగా ఉండవు..కానీ, గెలుపు మాత్రం టీడీపీదే అని చెప్పటం ద్వారానే డొల్లతనం బయట పడిందని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ సారి ఖచ్చితంగా వైసీపీ గెలిచి తీరుతుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఎన్నికల కౌంటింగ్ నాటి వరకైనా అభ్యర్దులకు ధైర్యం ఇచ్చేందుకు ఇటువంటి ఎత్తులు వేస్తున్నారే కానీ..వాస్తవంగా ఫలితాలు ఎలా ఉంటాయనేది ఇప్పటికే టీడీపీ నేతలకు అర్దమైపోయిందన్నది వైసీపీ నేతల వాదన. ఇక, తాను నాలుగు సర్వేలు చేయించానని..టీడీపీకే అనుకూలంగా ఉన్నాయని చెబుతున్న చంద్రబాబు ..మరి..ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఎందుకు వ్యతిరేకంగా వస్తాయో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications